రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు,ఆశయాలను పాటించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన కళ్యాణ్ విమర్శించారు.బుధవారం విశాఖపట్నం జిల్లా పోలేపల్లి గ్రామంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా రాష్ట్ర విభజన చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టిడిపి,బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చానని తెలిపారు. కొన్ని అభిప్రాయ బేధాలు కారణంగా 2019 లో పొత్తు కొనసాగలేదని అన్నారు. దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నామని పేర్కొన్నారు.పూర్తి కక్షపూరిత రాజకీయాలతో,వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ ప్రజాస్వామ్య గొంతును అనగదో క్కతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సిఆర్పీ నివేదిక ప్రకారం 2022 వ సంవత్సరంలో రాష్ట్రంలో 10,000 మంది మహిళలు అదృశ్యమైపోవటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలకు వైసిపి 85 ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకుంటుందని కానీ మార్చవలసింది ముఖ్యమంత్రిని అని తెలిపారు.
*ఇప్పటం ప్రకటనకు ప్రజా ఆమోదం
రెండేళ్ల క్రితం ఇప్పటం సభలో వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని తెలిపారు. యువత భవిష్యత్తు,సంక్షేమం, మహిళల భద్రతను, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.యువగళం ముగింపు సభ ద్వారా టిడిపి,జనసేన పొత్తుకు ప్రజా ఆమోదం లభించింది అని తెలిపారు. ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ ను నిర్దేశించే క్షణాలు అని పేర్కొన్నారు. ఆంధ్రపదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఈ పొత్తు మరింత ఎక్కువ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందిని అందుకే చంద్రబాబు ను కలిసి తన మద్దతు ప్రకటించానని తెలిపారు.ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరోసారి వైసిపి అధికారం లోకి వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను,టిడిపి,జనసేన పొత్తును గురుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలిపానని వెల్లడించారు.
- ఉమ్మడి మేనిఫెస్టో పై పవన్ సూచనలు
భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై మేనిఫెస్టో లో చేర్చే విషయాలను పరిశీలించాలని లోకేష్, చంద్రబాబు లను కోరారు. రోడ్లు, హెల్త్ కేర్, యువతకి ఉపాధి అవకాశాలు,సిపిఎస్ రద్దు, రైతులు,కౌలు రైతులు,ప్రభుత్వ పాఠశాలలు,పోలీస్ రిఫార్మ్స్, ఆక్వా రైతుల సమస్యలు,అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలు,చేనేత కార్మికులు,వైద్యం అందుబాటులో ఎలా తీసుకురావాలి,బిసి కులాలకు అండగా ఉండేందుకు ఏమి చేయాలన్న పలు అంశాలను చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. టిడిపి,జనసేన పొత్తుకు ప్రజల ఆశీస్సులు ఉండాలని విజ్ఞప్తి చేశారు.