టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలను రా కదలిరా అని పిలుపునిస్తుంటే.. సుప్రీం కోర్టు, రాజమహేంద్రవరం జైలు మాత్రం చంద్రబాబు ని పిలుస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను పక్కకు పెట్టారని, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టేందుకు లోకేష్ ను దింపారు అని విమర్శించారు. గుడివాడలో రా కదలిరా పేరుతో చంద్రబాబు పాల్గొనే సభను ఎవరు పట్టించుకోరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని అధికారం లో కూర్చెబెట్టుకొనెందుకు మాత్రమే తాను పని చేస్తానని,పదవులు కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సినీ రంగ పరిశ్రమలో ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చిన ప్రజలకు మేలు చేయటానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలలలో అధికారంలోకి తీసుకువచ్చారు అని పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల చేసి నమ్ముకున్న కుటుంబ చేతిలో మోసపోయారని పేర్కొన్నారు. అధికార దాహంతో ఒక దుర్మార్గుడు చేతిలో వంచనకు గురయ్యారని తెలిపారు.
ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
ఎన్టీఆర్ మహనీయుడని ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఎన్టీఆర్ అభిమానిగా గుడివాడలో 28 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం వర్ధంతి,జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.నాడు ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు ఆయనకు పూజలు చేస్తున్నారనీ విమర్శించారు. చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. బాలకృష్ణ ,చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చినా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం తప్ప ఏమీ చేయలేరని మండిపడ్డారు. ఈరోజు గుడివాడలో రా కదలిరా సభతో టిడిపికి ఎటువంటి ఉపయోగం ఉండదు అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు.. అప్పుడు ఏం జరిగిందో, తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందని వెల్లడించారు.సీఎం జగన్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారే బయటకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తె తమకు వచ్చే నష్టం లేదని వెల్లడించారు.