ఒకపక్క విశాఖపట్నంలో ఋషికొండ మీద బోలెడు రాద్ధాంతం జరుగుతూ ఉంటే… మరోవైపు వైసీపీ నాయకులు మళ్లీ అదే పనిగా కొండలను మింగేసే పనిలో బిజీగా ఉండడం విశేషం. తాజాగా వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న విజయ్ సాయి రెడ్డి తన కూతురు నేహా రెడ్డి పెట్టబోయే ప్రైవేట్ యూనివర్సిటీ నిమిత్తం విశాఖ శివారులో ఉన్న తుర్లకొండ తీసుకోవాలని చూస్తున్నారు. యూనివర్సిటీ మొత్తం తుర్లకొండ ప్రాంతంలో నిర్మించేలా కొండను చదును చేసి ఆ ప్రాంతంలో భవనాలు నిర్మించేలా ప్రణాళిక వేస్తున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా విమర్శలు చేసిన నిరసనలు చేసిన పట్టించుకోని వైసిపి నేతలు విశాఖలోని అన్ని కొండలను తమ ఆధీనంలో తీసుకునే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. ఒకపక్క ఎన్నికలు వేగంగా వస్తున్నప్పటికీ దానిని ఏమి పట్టించుకోకుండానే తమ పనులు తాము చేసుకోవడానికి వైసిపి నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని సహజ వనరులను కొండలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఫలితంగా అక్కడ భారీగా ఆస్తులు పోగేయడం మీద వైసిపి దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఋషికొండ పైన భారీ భవంతులు నిర్మిస్తున్న సంగతి ఇప్పుడు విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ నిర్మిస్తున్న భవనాలు దేనికి అనేది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అసలు దేనికి నిర్మిస్తున్నారు తెలియకుండా అంత పెద్ద భవనాలు నిర్మించడం ఎందుకో కూడా సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. ఒకసారి సచివాలయం కోసం అని మరోసారి పర్యాటకుల కోసం అంటూ రకరకాలుగా కథలు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఋషికొండ పరిశీలనకు వెళ్లడంతో పాటు అక్కడ జరుగుతున్న భవన నిర్మాణాలపై ఆ పార్టీ నాయకులు సైతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేశారు. మరోపక్క సముద్ర గాలులను బలంగా తట్టుకొని నిలబడగలిగే ఋషికొండను తవ్వేయడం పర్యావరణానికి హితం కాదు అని చెబుతున్నప్పటికీ వైసీపీ నాయకులు అవేవీ పట్టించుకోకుండా రుషికొండ మీద మాట్లాడిన వారిపై ఎదురుదాడికి దిగడం విశేషం. సాధారణమైన కొండలకు ఋషికొండకు ముడిపెడుతూ వైసిపి నాయకులు అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. ఋషికొండ మీద మాట్లాడితే హైదరాబాద్ కొండల మీద సినిమా యాక్టర్ల ఇల్లు లేవా అంటూ కొత్త వాదనకు దిగుతున్నారు. ఋషికొండ అనేది ఎందుకు పర్యావరణానికి అవసరమో అర్థం చేసుకోకుండా వితండవాదనకు దిగుతూ వైసిపి నాయకులు ఇప్పటికే అబాసు పాలయ్యారు. ఋషికొండ ప్రత్యేకతను తెలుసుకోకుండా ఏమాత్రం అవగాహన లేకుండా వైసిపి నాయకులు మాట్లాడుతున్న మాటలు వైసిపి ప్రభుత్వ పాలనకు కూడా చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయి.