రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే గడువు ఉండగా…రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి భార్య వైయస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కొడుకు,కుమార్తె లలో ఆమె ఎవరికి మద్దతు ఇస్తుందో అన్న ప్రశ్న అందరిలో ఉంది.ఆ ప్రశ్నలకు ఆమె తెరదించారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ అమలులోకి వచ్చిన తరువాత విజయమ్మ అమెరికాకు వెళ్ళారు. ఎన్నికల ప్రచారంలో రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వంపై సిఎం జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాజశేఖర్ రెడ్డి అభిమానలందరు షర్మిల కు అండగా నిలబడాలని వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. శనివారం కడప పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఆమె మాట్లాడిన ఒక వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.కడప పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ షర్మిల ను గెలిపించాలని విజయమ్మ కోరారు. రాజశేఖర్ రెడ్డిని కడప జిల్లా ప్రజలు ఎంతో అభిమానించారు.మీ అందరి అభిమానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు.అదే విధంగా షర్మిల ను కూడా గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు రాజశేఖర్ రెడ్డి వలే సేవ చేసేందుకు ఆమెకు అవకాశం కల్పించాలని కోరారు.