ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్త కష్టం వచ్చి పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు రోడ్డుపైకి వస్తుండడంతో సిబ్బందిని సర్దుబాటు చేయలేక పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలో చాలావరకు ఖాళీలు ఉన్నాయి. శాంతిభద్రతల విభాగంతో పాటు ఏఆర్ అలాగే ఏపీపీఎస్సీ విభాగాల్లోనూ సుమారుగా 35000 పోస్టులకు పైగా ఖాళిలు ఉన్నట్లు అంచనా. మరోవైపు శాంతిభద్రతల విభాగంలో పోలీసులు సైతం నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుండడంతో పాటు రాజకీయ పార్టీలు వివిధ యాత్రల సందర్భంగా భారీగా బందోబస్తును ఇవ్వాల్సి రావడంతో ఏం చేయాలో అర్థం కాని పనిలో పోలీసులు పడ్డారు.
వద్దు అంటే??
యాత్రలకు అనుమతులు వద్దు అంటే పోలీసులకు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యాత్రల సందర్భంగా ఏవైనా జరగరని సంఘటనలు జరిగితే ఖచ్చితంగా పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. యాత్రలకు అనుమతి ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా యాత్రలు చేసే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల స్థితి గతుల మీద కదలికల మీద పోలీసులు నిగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే జనంలో తిరుగుతూ బహిరంగ సభలకు హాజరవుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోపక్క నారా లోకేష్ యాత్రలో చేపడుతుండడం తో పాటు ఈనెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రోడ్డుపైకి రానున్నారు. ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ యాత్రలకు జనం భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో పక్క ముఖ్యమంత్రి జగన్ కూడా తరచూ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ యాత్రలకు ఆ యాత్రలకు మధ్యలో ఎక్కడైనా సమన్వయం కుదరకపోతే పెను నష్టం తప్పదు. దీనిపై పోలీసు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కొత్త జీఓ తెస్తుందా?
బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు వద్దని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్ వన్ హైకోర్టు కొట్టేసింది. అయితే దీనిలో మార్పులు చేర్పులు తీసుకువచ్చి కచ్చితంగా జీవో తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. దీనిపై త్వరలోనే జీవో తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక తీసుకువస్తే దానిని అడ్డుపెట్టుకొని పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. దీంతో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందా లేదా పోలీసులకే మొత్తం బాధ్యత అపజగుతుందా అన్నది అర్థం కావడం లేదు.