- విశాఖలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మహిళల వినూత్న నిరసన
- బూమ్ బూమ్ సృష్టికర్తకు స్వాగతం అంటూ నినాదాలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. అత్యంత అరుదైన ఘనత సాధించారు.. మహిళల చేత మద్యంతో అభిషేకం అందుకున్నారు..
రాష్ట్రంలోనే కాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఇప్పటి వరకూ జరగని అరుదైన సత్కారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దక్కింది.. మద్యంతో జగన్ చిత్రపటానికి అభిషేకం నిర్వహించి వినూత్న రీతిలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆధ్వర్యంలో విశాఖ మహిళలు నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ .. ఆ హామీని తుంగలో తొక్కి ప్రభుత్వం ద్వారా మద్యం వ్యాపారం చేస్తూ రకరకాల చీప్ మద్యం బ్రాండ్ లను మార్కెట్ కు పరిచయం చేశారు. ఈ ఏడాది విజయ దశమి పర్వదిన మూహూర్తంగా సీఎం జగన్ విశాఖకు తన మకాం మార్చి పరిపాలన ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నారు..
త్వరలో విశాఖకు సీఎం జగన్ విచ్చేస్తున్న నేపథ్యంలో బీసీవై పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవేళ విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు లో పెద్ద సంఖ్యలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. “బూమ్ బూమ్ బ్రాండుల సృష్టికర్త.. రుషికొండని మింగిన అనకొండ.. చీప్ బ్రాండ్ల రూపకర్త.. జగనొస్తున్నాడు జాగ్రత్త” అంటూ విశాఖ వాసులను హెచ్చరిస్తూ.. నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం నిర్వహించారు. మద్య నిషేదం అంటూ బూటకపు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నాశిరకం బ్రాండ్ లను తీసుకువచ్చి విక్రయిస్తున్నందున ఈ రకంగా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీవై మహిళా నేతలు తెలిపారు.
అరుదైన చరిత్ర..!
దేశ చరిత్రలో ఇది ఓ అరుదైన నిరసనగా పేర్కొనవచ్చు. ఇంత వరకూ ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి మద్యాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. దీంతో బీసీవై పార్టీ మహిళా విభాగం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమం హైలెట్ అయ్యింది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిమిషాల్లో వీడియోలు, ఫోటోలు చేరిపోవడం తో ఈ పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.. విశాఖ సహా, రాష్ట్రంలోని రాజకీయ, తటస్థ వర్గాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాయి..