fbpx

ఆలూరు టికెట్ బొజ్జమ్మకు ఇస్తారా?.

Share the content

కర్నూలు జిల్లాలో అతి కీలకమైన ఫ్యాక్షన్ నేతగా గుర్తింపు పొందిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కూతురు బొజ్జమ్మ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొజమ్మకు వైసీపీలో చేరటం ఇష్టం లేదు కానీ ఆ పార్టీ నేతలే ముఖ్యంగా PK team రిపోర్ట్స్ వలన బొజ్జమ్మకు ఆలూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారని ఆవిడ వర్గం ప్రచారం చేస్తుంది.

అల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న గుమ్మనూరి జయరాంను ఈసారి కర్నూల్ ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. నిన్న బొజ్జమ్మ సీసీపీలో చేరిన సమయంలో జయరాం కూడా ఉన్నారు. కానీ జయరాం ఆలూరు ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటారని నేను అనుకోను.

టీడీపీ తరుపున జడ్పీటీసీగా ఉన్న జయరాంకు 2009లో ప్రజారాజ్యం టికెట్ ఇచ్చింది. టీడీపీ తరుపున మిత్రపక్షమైన సిపిఐ రామకృష్ణకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరుపున ఈమధ్య చనిపోయిన నీరజారెడ్డి పాటిల్ కు టికెట్ ఇవ్వగా, కోట్ల సుజాతమ్మ కజిన్ సీనియర్ కాంగ్రెస్ నేత హాలాహరి కేశవరెడ్డి రెబల్ గా పోటీ చేశారు. హోరాహోరి పోరులో జయరాం కేవలం 1900 ఓట్ల తేడాతో నీరజారెడ్డి మీద ఓడిపోయారు.
2009 మరియు 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూల్ లోక్.సభకు బోయ నేత బిటి నాయుడు.పోటీచేసి ఓడిపోయారు.2024లో జయరాం ఎంపీగా పోటీచేయటనికి ఇష్టపడతారా?

జయరాం పట్టు బడతారు

బోయ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు సామాజిక బలం ఎక్కువ. జయరాం సోదరుడు(పెద్దమ్మ కొడుకు ) నాగేంద్ర బళ్లారిలో సీనియర్ నాయకుడు. మొన్న జరిగిన ఎన్నికల్లో బళ్ళారి రూరల్ నుంచి శ్రీరాములును ఓడించి మంత్రి అయ్యారు. నాగేంద్ర మద్దతు జయరాంకు అదనపు బలం. రాహుల్ జోడో యాత్ర సమయంలో కూడా జాతీయ కాంగ్రెస్ నాయకులు జయరాం ఇంటికి వెళ్లారు.
వైసీపీ తరుపున 2014,2019లో గెలిచిన జయరాం మంత్రి అయినా తరువాత వ్యతిరేకత పెరిగింది. సొంత కులంతో పాటు సామాన్యుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అనేక భూఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జయరాం ను ఎంపీగా పంపించి బొజ్జమ్మ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.
జయరాం కాకుంటే ఆయన ఇంట్లో మరొకరికి ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడు కానీ బొజ్జమ్మ టికెట్ ఇవ్వటానికి ఒప్పుకోడు ,ఒకవేళ ఆవిడకు టికెట్ ఇచ్చినా సహకరించరు.
బొజ్జమ్మ బలం ఇప్పుడు చాలా పరిమితం, ఒక ఐదు ఆరు ఊర్లలో మాత్రమే వారి వర్గం మిగిలింది. వెంకటప్పనాయుడు బోయ కానీ అయన చనిపోయిన తరువాత ఒక ఇంటర్వ్యూ లో తాము “పాల ఏకిర్ల” మని బొజమ్మ చెప్పింది. ఆవిడ భర్త కదిరికి రామచంద్రనాయుడు కూడా పాల ఏకీరనే . దీన్ని స్థానిక బోయలు ఎలా తీసుకుంటారో చూడాలి.

కోట్ల సోదరులు పరిస్థితి ఏంటీ?

ఒక వేళ బొజ్జమ్మకు టికెట్ ఇస్తే కోడుమూరు ఇన్ చార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఏ పార్టీలో లేకుండా వైసీపీలో చేరటం కోసం ఎదురుచూస్తున్నాడు. కోట్ల వర్గం తరుపున కప్పట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడుతో పోరాడింది హర్షవర్ధన్ రెడ్డి మరియు హరిచక్రపాణి రెడ్డి. 2014 ఎన్నికల్లో హరిచక్రపాణి రెడ్డి వైసీపీ తరుపున పత్తికొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తనను ఓడించటానికే తన అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పోటీకి పెట్టాడని ఆరోపించాడు. 2019 ఎన్నికల్లో మాత్రం సూర్యప్రకాష్ రెడ్డి కి మద్దతుగా పనిచేశాడు.

బోయేతర బిసిల పరిస్థితి ఏంటి?
వైసీపీ తరుపున చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుక గారికి 2014లో డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి 2019లో ఎంపీ టికెట్ ఇచ్చింది, ఇద్దరు గెలిచారు. ఇప్పుడు 2024లో సంజీవ కుమార్ ను తప్పించి జయరాంకు ఇస్తే చేనేతలకు ఎక్కడ టికెట్ ఇస్తారు?. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ మీద బుట్ట రేణుక ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కేశవరెడ్డి దాదాపు 80 సంవత్సరాల వయస్సు రావటంతో ఆయనకు టికెట్ రాదనీ ప్రచారం జరుగుతుంది. ఎమ్మిగనూరులో చేనేత వర్గం దాదాపు 25 వేల ఓట్లు ఉండటం వలన ఈసారి ఎమ్మిగనూరు టికెట్ చేనేత వర్గానికి ఇస్తారని అంచాన. పశ్చిమ కర్నూల్లో బోయల తరువాత కురబలు ఎక్కువ. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కురుబలు ఎక్కువ. కాంగ్రెస్ తరపున కురుబ సామాజికవర్గానికి చెందిన కే వి నర్సప్ప 1962,1972 & 1978లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు,మంత్రి కూడా అయ్యారు. హిందూపూర్ ఎంపీ కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల ఎంపీ మాధవ్ కు ఈసారి పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఒక దశలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కర్నూల్ జిల్లాలో బోయలకే అవకాశాలు వస్తున్నాయని మిగిలిన బీసీ కులాల ఆరోపణ. మంత్రి జయరాం,ఎమ్మెల్సీ Dr.మధుసుధన్ , మేయర్ బి.వై . రామయ్య, గ్రంధాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఇలా అనేక పదవులు బోయలకే ఇచ్చారని కురుబ,చేనేత,యాదవ వర్గాల నుంచి ఆక్షేపణ ఉంది . మొన్న ఎమ్మెల్సీ పదవుల్లో అనంతపురం నుంచి బోయ మంగమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చారు,కర్నూల్ నుంచి కూడా బోయ మధుసూదన్ కు ఇవ్వటం మీద ఇతర బీసీ కులాల అలక. కర్నూల్ ఎంపీ జయరాంకు ఇస్తే అనంతపురం ఎంపీ బోయ సామాజిక వర్గానికే చెందిన తలారి రంగయ్య సార్కు మరోసారి టికెట్ ఇస్తారో లేదో చూడాలి. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఫలితాలను ఇస్తుందా లేదా ఉన్న సమీకరణాలను డిస్ట్రబ్ చేస్తుందా చూడాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *