రాష్ట్రంలో 28 వేల మంది వీఆర్ఏలకు గత ఆరు ఏళ్లుగా జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండించింది. గురువారం విజయవాడ దుర్గాపురం లో గల సిఐటియు రాష్ట్ర కార్యాలయం నందు వీఆర్ఏల జేఏసీ సమావేశం టి అంజి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిత్యవసర సరుకుల ధరలు చుక్కలంటుతున్న తరుణంలో చాలిచాలని వేతనాలతో బతుకుతున్న వీఆర్ఏలకు గత ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెలకు పదిహేను వేల రూపాయలకు జీతాన్ని పెంచుతానని ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఆరు నెలల క్రితం 500 రూపాయలు డిఎ ఇస్తామంటూ ఇచ్చిన హామీ కూడా నేటికీ అమలుకు నోసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హులైన వీఆర్ఏలకు అటెండర్, వాచ్ మెన్, వీఆర్వో, డ్రైవర్లు రికార్డ్ అసిస్టెంట్ మరియు స్వీపర్ల ఖాళీ పోస్టులో ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ నాగేష్ మాట్లాడుతూ… నామినీ ఇళ్లను వీఆర్ఏలగా గుర్తించాలని కోరారు. టి అంజి మాట్లాడుతూ… గ్రాట్యూటీ చెల్లింపు కాలపరిమితిని రెండు నుండి పది సంవత్సరాలకు పెంచి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. డైరెక్టు రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం నాయకులు రాఘవేంద్ర మాట్లాడుతూ… వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల ఏడో తేదీ జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమంలో వీఆర్ఏల అందరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘాల నాయకులు త్రినాధరావు సుబ్బన్న రవి బాజీ బాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రెవిన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంచార్జ్ కార్యాలయంలోనూ మరియు మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో అధికారులకు జేఏసీ నాయకులు వినతి పత్రాలు అందజేశారు.