ఉత్తరాంధ్ర మీద పట్టు కోసం జగన్ వేస్తున్న ఎత్తులను విపక్షాలు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం మీద జగన్ దృష్టి ఎక్కువ. కచ్చితంగా విశాఖపట్టణాన్ని పూర్తి వైసీపీ పట్టణంగా చేయాలి అనేది జగన్ ప్లాన్. గతంలో తన తల్లి విజయమును ఘోరంగా ఓడించిన విశాఖపట్నం మీద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని జగన్ బలంగా భావిస్తున్నారు. దీంతో పాటు విశాఖపట్నం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతంగా జగన్ గుర్తించారు. దీంతో అమరావతిని కాదని మరి విశాఖపట్నం కేంద్రంగా రాజధాని పెట్టాలన్న ఆలోచన పూర్తిగా విశాఖపట్నం మీద పట్టుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సెంటిమెంట్ రగిలించాలని భావనతో ముడిపడి ఉన్న అంశం. దీంతో రాజకీయంగా కూడా వైసీపీకి తిరుగులేకుండా పోతుందని జగన్ అంచనా వేశారు. అయితే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేయాలని మొదటినుంచి పట్టు మీద ఉన్న జగన్ కు కేంద్రం నుంచి వస్తున్న అడ్డంకులు ఒక్కొక్కటి తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఎన్నికలు రాబోతున్న తరుణంలో సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం వేదికగా పాలన సాగిస్తామని చెప్పిన జగన్ వచ్చేసారి కూడా తన ఆశను వదులుకోవాల్సిందే అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రకరకాల వ్యూహాలు తిప్పి కొడుతున్న విపక్షాలు
రాయలసీమలో కచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించవచ్చు అన్న అభిప్రాయం జగన్ కు ఇప్పటికీ ఉంది. సీమ జిల్లాల్లోని కీలకమైన నాలుగు జిల్లాల్లో కచ్చితంగా తనకు తిరుగు ఉండదు అని జగన్ బలంగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కూడా కలుపుకుంటే తనకు ఇక తిరుగు ఉండదు అని జగన్ భావించడం వల్లనే ఉత్తరాంధ్ర మీద ముఖ్యంగా విశాఖపట్నం మీద ఆయన పట్టు పెంచుకోవాలని భావించారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని ఒక రకమైన సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారు. అయితే దానికి ఉత్తరాంధ్ర ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. ఏకంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేత రాజీనామా చేయించినప్పటికీ ఆ పాచిక పారలేదు. దీంతోపాటు విశాఖపట్నం కేంద్రంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా కీలకంగా రాజకీయాలు ముందుకు నడిపిస్తుండడంతో జగన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. విశాఖపట్నంలో జనవాణి నిర్వహించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడం ద్వారా ప్రజల మద్దతు ఆయనకు జగన్ తెచ్చినట్లు అయింది. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి తర్వాత నుంచి మెల్లమెల్లగా ఆ ప్రాంతం మీద మాటలు మాట్లాడడానికి కూడా అధికార పార్టీ నుంచి ఎవరు ముందుకు రావడం లేదు. 2019 జగన్ గాలిలోనూ విశాఖపట్నంలోని కీలకమైన నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. అంత భారీ గాలిలోనూ విశాఖపట్నం టిడిపి కంచుకోటగా కనిపించింది. దీంతోనే ఇక్కడ పార్టీని పటిష్టం చేయడంతో పాటు మిగిలిన రెండు జిల్లాల్లో సైతం పట్టు పెంచుకోవాలని దీని ద్వారా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల మద్దతు సాధించి 2024 ఎన్నికల్లో సులభంగా గట్టు ఎక్కవచ్చని జగన్ భావించారు. దీనికోసం మూడు రాజధానులు అంటూ పల్లవి ఎత్తుకొని దానిని సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లడంలో చతికిల పడ్డారు. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రధాన సెంటిమెంట్ తగిలించడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ టీం వేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశానికి ప్రజల నుంచి కూడా ఏమాత్రం స్పందన లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పుడు వైసీపీ వెతుకుతోంది.