శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షించారు.మంగళవారం ఉదయం కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి, సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్య అతిథి గాను, పోలీసు సూపరింటెండెంట్ ఎస్ సతీష్ కుమార్ విశిష్ట అతిథి గాను హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పసుపులేటి వెంకట రమణ బృందం మంగళ నాద స్వర నాదం అనంతరం వేద పండితులు కప్పగంతుల చంద్రశేఖరశాస్త్రి అవధాని, బులుసు అయ్యప్పశాస్త్రి అవధాని, కందాళం సూర్యనారాయణశాస్త్రి అవధాని, కొండూరి ఆంజనేయశాస్త్రి అవధాని వేద గానం చేసి అతిధులకు, ఆహూతులకు ఆశీర్వచనం పలికారు. తదుపరి వక్కలంక శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే దేశ కాలమాన పరిస్థితులు, నవ నాయక, కందాక ఫలాలు, .. వర్షాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిపాలన తదితర రంగాలో ప్రగతి, రాశి ఫలాలపై వివరించారు.
పిల్లలు ఉన్నతస్థానాలకు ఎదగాలి
తెలుగు నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ… తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, తొలి పండగ ఉగాది అని.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
సుఖసంతోషాలతో జీవించాలి: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కాంక్షించారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
అలరించిన సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది వేడుకల్లో గీతం స్కూల్ పాఠశాల విద్యార్ధిని ఎం.శ్రీకరణి, సెయింట్ పి ఎస్ ఎంసి గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు ఎం.నీహారిక, ఎం.నిరుపమ చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కొరుప్రోలు గౌరినాయుడు ఆధ్వర్యంలో కవులు మార్ని జానకిరామ చౌదరి, అద్దేపల్లి జ్యోతి, కొత్త అప్పారావు, దొండపాటి నాగ జ్యోతి శేఖర్ , పి ఎన్ వి ఎస్ ఇందిర, మాకినీడి సూర్యభాస్కర్, ర్యాలి ప్రసాద్ నిర్వహించిన వసంత కవితాగానం ప్రేక్షకులను అలరించింది. అలాగే తలారి ఆనంద్, అజయ్ బృందం సంగీత విభావరి ఆకట్టు కుంది.
వేద పండితులు, కవులకు సత్కారం
శ్రీ క్రోధి నామ ఉగాది వేడుకల్లో భాగంగా
జిల్లా సాంస్కృతిక మండలి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేద, పంచాంగ పండితులు, అర్చక స్వాములు, కవులు, కళాకారులకు జిల్లా కలెక్టర్, ఎస్ పి చేతులు మీదుగా సత్కరించి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా రంగాలకు వారందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మునిసిపల్ కమిషనర్ జె.వెంకటరావు, జిల్లా దేవాదాయ అధికారి పి.నారాయణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె నరసింహ నాయక్, డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి , సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీ డి.నాగార్జున, కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సి.బాబూరావు, పౌర సరఫరాల శాఖ డీఎం బాల సరస్వతి, జడ్పీ డిప్యూటీ సీఈఓ జి.రాంగోపాల్, డిప్యూటీ డీఈవో ఆర్జే డేనియల్ రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు.