రెండు విడతల్లోనూ జనసేన పార్టీ నిర్వహించిన వారాహి యాత్ర విజయవంతం కావడంతో మూడో విడత యాత్ర కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాలపై పూర్తిగా దృష్టి పెట్టిన జనసేన అధినేత మూడో విడత యాత్ర కూడా గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. పాలకొల్లు నుంచి 27వ తేదీన వారాహి మూడో విడత యాత్ర ప్రారంభం అవుతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఈ మేరకు పోలీసు వారిని కూడా సంప్రదించి బందోబస్తు కల్పించాలని కోరినట్లు తెలిసింది. మరో పక్క పాలకొల్లులో ప్రముఖ సినిమా నిర్మాత బన్నీ వాస్ కూడా యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడంతో వారాహి యాత్ర షెడ్యూల్ రేపో మాపో బయటకు వస్తుందని తెలుస్తోంది. మూడో విడతలో పాలకొల్లు తో పాటు ఆచంట, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 28వ తేదీన బ్రో సినిమా విడుదల ఉండడంతో యాత్ర షెడ్యూల్ను ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయా అనేది కూడా అనుమానం కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను జనసేన వర్సెస్ వైసీపీగా తీసుకువెళ్లడంలో వారాహి యాత్ర ఎంతగానో ఉపయోగపడింది. జనసేనకు పూర్తిస్థాయిలో మైలేజ్ తీసుకురాగలిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోడ్డుపై ఉన్న ప్రతిరోజు వైసిపి నాయకులకు దినదిన గండంగా తయారయింది. ఈ సమయంలో యాత్రకు ఏమాత్రం బ్రేకులు వేయడం తగదని వెంటనే మూడో విడత యాత్రను కూడా మొదలు పెట్టాలని జనసేన పార్టీ అభిమానులతో పాటు నాయకులు భావిస్తున్నారు. దీంతో మూడో విడత యాత్రకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఏ నిమిషం అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుండడంతో పవన్ కళ్యాణ్ కూడా అదే స్పీడుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసిన సందర్భంలోనూ జగన్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న పవన్ వెంటనే వారాహి యాత్రను మొదలుపెట్టి రోడ్డుపైనే ఉండేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
గోదావరి అయ్యాకే
గోదావరి జిల్లాల్లో అధిక సీట్లను ఆశించడంతోపాటు పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. దీంతో వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసిన తర్వాతనే మిగిలిన జిల్లాల్లో వారాహి యాత్ర మొదలు పెట్టాలి అని ఆయన భావిస్తున్నారు. దీంతో మూడో విడత యాత్ర కూడా గోదావరి జిల్లాలోని ప్రారంభించి ముగించాలని తర్వాత కూడా పూర్తిస్థాయిలో గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాతే మిగిలిన జిల్లాల్లో ఆయన తిరుగుతారు అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను జనసేన ఆశిస్తుందని, ఇక్కడ సత్తా చూపడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా మారనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎంతో పట్టు ఉన్న గోదావరి జిల్లాలనే కంచుకోటగా మార్చుకొని తర్వాత మిగిలిన జిల్లాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేలా ప్రణాళిక వేస్తున్నారు.