చీరాల రాజకీయాలు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలే బాహబాహికి దిగడం ఇప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎప్పటినుంచో ఉన్న గొడవలు ఎన్నికలనాటికి మరింత ముదురుతున్నాయి. కరణం బలరం వర్గానికి ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి ఉప్పు నిప్పులా ఉన్న గొడవలు ఇప్పుడు బయటపడుతున్నాయి.
ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీ అధిష్టానం పర్చూరు పంపినప్పటికీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన తన పంతాన్ని విడడం లేదు. ఫలితంగా ప్రతిసారి అక్కడ గొడవలు నిత్యకృతంగా మారుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల వరకు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో ఉంటారా ఉండరా అనే సందేహం కూడా ఇప్పుడు కలుగుతుంది. అయిష్టంగానే పరుచూర్ వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్ సొంత నియోజకవర్గ చీరాలలో తన పట్టు కోల్పోతున్నారు అన్న భావన కలిగిన ప్రతిసారి కరణం బలరాం వర్గంతో బాహబాహీ కి దిగుతున్నారు. దీంతో చీరాల నియోజకవర్గంలో వైసీపీకి తలనొప్పులు తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు చీరాల మొత్తం చక్కదిద్దినట్లేనని భావించిన వైసీపీ అధిష్టానం తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల నామినేషన్ సందర్భంగా మరోసారి జరిగిన గొడవలతో తల పట్టుకున్నట్లు అయింది. వైసీపీ అధిష్టానం పెద్దలు ఆమంచితో మాట్లాడుతున్నప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆమంచి కృష్ణమోహన్ కూడా మూట ముళ్ళు సర్దుకుని జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు చీరాల రాజకీయాలు ఏం జరుగుతాయి అన్న సందేహం ప్రకాశం జిల్లా అన్ని పార్టీల నేతల్లోనూ జోరుగా జరుగుతోంది.