ముఖ్యమంత్రి జగన్ ను ఒక విషయంలో మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి .. తన రాజకీయ శత్రువును, తనకు అడ్డు తగిలే వారిని కచ్చితంగా ఆయన పూర్తిస్థాయిలో శత్రువులుగా చూస్తారని ప్రజలందరికీ తెలిసేలా పగ తీర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏదైనా ఒక వ్యక్తి మీద కానీ వ్యవస్థ మీద గాని అలాగే పార్టీ మీద గాని శత్రువుగా ముద్ర వేస్తే వైయస్ జగన్ వారి మీద పగ తీర్చుకునే విషయం బహిరంగంగా అందరికీ తెలుస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తులు ఏం చేస్తారు అని గాని వ్యవస్థలు వల్ల తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అని కానీ లేకపోతే ఇతరత్రా సమస్యలు వస్తాయి అని కానీ ఆలోచించే మనస్తత్వం జగన్ కు ఉండదు. ఎవరి మీద అయినా పగబట్టి మరి కక్ష తీర్చుకోవడం జగన్ అందరికీ తెలిసేలా చేయడం ద్వారా తనను మరెవరు ఇబ్బంది పెట్టకూడదు అనే సంకేతాలను ఇస్తుంటారు. ఒకవేళ ఇబ్బంది పెడితే ఎలాంటి వారికైనా ఇలాంటివి గతి పడుతుంది అని హెచ్చరికలు పంపేలా ఆయన చర్యలు ఉంటాయి.
** జగన్ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలను రాజకీయ వర్గ శత్రువులుగా ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు క్షత్రియ సామాజిక వర్గాన్ని సైతం ఆయన తన వర్గ శత్రువులుగా ప్రకటించి వారికి రాజకీయంగా కూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. జగన్ మంత్రివర్గంలో ఇప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఎవరు లేకపోయినా ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తమ వర్గానికి ఏమైనా చేయాలి అని పదవులు డిమాండ్ చేయకపోవడం విశేషం . ఇక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా లేరు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకు కేవలం చీఫ్ విప్ పదవి ఇచ్చి సరిపెట్టారు. ఈ రెండు సామాజిక వర్గాల వారు తమకు రాజకీయ వర్గ శత్రువులు అనేలా జగన్ ఆయా వర్గాల పైన చేసిన దమన కండ అంతా ఇంతా కాదు. మొదటి మంత్రివర్గంలో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఉంటే తర్వాత దానిని కూడా జగన్ తొలగించారు. ఇక క్షత్రియ సామాజిక వర్గం నుంచి రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తే రెండు మంత్రివర్గంలో అతని మంత్రి పదవి కూడా ఊడింది. రెండు సామాజిక వర్గాలు తనకు అవసరం లేదు అన్నట్లుగానే ప్రతిసారి జగన్ ప్రవర్తిస్తూ వచ్చారు. ఇక ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని సామాజిక వర్గాల నాయకులకు ప్రాధాన్యమిస్తూ ఆయా సామాజిక వర్గాలను తాము పట్టించుకున్నట్లుగా బిల్డప్ ఇచ్చేవారు. జగన్ మాత్రం తనకు ఏ సామాజిక వర్గం వద్దు అనుకుంటే వారికి ఎలాంటి పదవి లేకుండా పూర్తిగా తన శత్రువులుగా పరిగణించడం.. రాజకీయంగా ఆయా సామాజిక వర్గాల వారి అండదండలు లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ప్రవర్తించడం జగన్ కు మాత్రమే చెల్లింది. ఎలాంటి రాజకీయ భయం లేకుండా ఇప్పుడు చంద్రబాబు మీద పెడుతున్న వరుస కేసులు కూడా అలాంటి కోవలోకి వస్తాయి. ప్రభుత్వం కచ్చితంగా మారితే మాత్రం జగన్ మళ్లీ బయటకు రాలేని విధంగా కేసులు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్న వేళ జగన్ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చంద్రబాబు మీద ఐదో కేసును కూడా నమోదు చేయడం విశేషం. జగన్ ఒకరిని శత్రువుగా పరిగణిస్తే ఎంతటి వారు అయినా సరే ఖచ్చితంగా ఆయన బారిన పడి విలవిలాడాల్సిందే. అది వ్యక్తులైన లేక పార్టీలు అయిన సరే అన్నట్లు జగన్ ప్రభుత్వం నడుపుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఏ వర్గాలను ఏ ఉద్యోగులను ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం విశేషం.