ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు టిడిపికి కనిపించడం లేదు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని పరిస్థితిని పార్టీ అధిష్టానం ఏ మాత్రం అంచనా వేయలేకపోతోంది. కనీసం రాజకీయాలకు దగ్గరగా ఉన్న వారు కూడా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం టిడిపి అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట సాగిస్తున్నారు. ఎస్సీ ఉప కులాల్లోని అన్ని వర్గాలను కలుపుకుపోయే ఆలోచన ఉన్నప్పటికీ, ఆ దిశగా బలమైన అభ్యర్థులు మాత్రం టిడిపి కంట పడడం లేదు. టిడిపిలోని పోలీస్ బ్యూరో సభ్యులతో ఎప్పటికీ కమిటీలు వేసి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు వేటను మొదలుపెట్టిన టిడిపికి కొత్త నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే వారిని నమ్ముకుంటే వచ్చే ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ చేయగలరా లేదా ప్రత్యర్థి పార్టీల సీనియారిటీ ఆలోచనలను తట్టుకుంటారా లేదా అన్నది కూడా సందేహాస్పదంగానే కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు ప్రకారం
చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోని మూడు ఎస్సీ రిజర్వుల నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించే ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టారు. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో గతంలో రెండుసార్లు పోటీ చేసిన లలిత కుమారిని కాదని, జర్నలిస్టు అయిన మురళీమోహన్ కు బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసిన మురళి మోహన్ స్థానికుడే అయినప్పటికీ ఆర్థికంగా అంత బలవంతుడు కాదు. అయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా మురళీమోహన్ ను నియమించారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో డాక్టర్ థామస్ ను నియమించారు. ఈయన పూర్తిగా రాజకీయాలకు కొత్త. ఆరు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో రాజకీయం చేయాలంటే కచ్చితంగా అనుభవం ఉన్నవారు బాగుంటుంది అని భావించినప్పటికీ, తలారి ఆదిత్యను కనీసం పరిగణలోకి కూడా తీసుకోకపోవడం విశేషం. ఇక చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఒక డాక్టర్ను ఇన్చార్జిగా నియమించనున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గం అయిన జీడీ నెల్లూరులో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఆర్టీసీ రీజినల్ చైర్మన్ విజయానంద రెడ్డిని అక్కడ రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే చాలా కష్టం. మరి కొత్త వ్యక్తులు ఆయన రాజకీయాన్ని ఎలా ఎదుర్కొంటారు అని టిడిపి భావిస్తుందో అర్థం కావడం లేదు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాలకు కూడా త్వరలోనే ఇన్చార్జిలను వేయాలని భావిస్తున్నారు. చింతలపూడి ని మాల సామాజిక వర్గానికి కొవ్వూరును మాదిగ సామాజిక వర్గానికి గోపాలపురంను అక్కడున్న పరిస్థితులు దృష్ట్యా ఇన్చార్జిని నియమించడం ఇప్పటివరకు ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసేందుకు కూడా టిడిపి సిద్ధమవుతోంది. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాలపై ఒక్కొక్కటిగా దృష్టి పెడుతూ వాటిని పూరించే పనిలో టిడిపి అధిష్టానం ఉంది.