రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసిలు, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ లను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ గా ఉపయోగించకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం గురజాల లోని ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పార్టీ మారుతున్నారు అంటూ తనపై సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను చూపిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్నామని, రాజకీయాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్ తమను ఆదరించారని పేర్కొన్నారు. వైసిపి నాయకులు ఏమీ చేయలేక విష ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే వైసిపి సోషల్ మీడియా పని చేస్తుందని వెల్లడించారు. టిడిపికి యరపతినేని ఒక పిల్లర్ లాంటి వ్యక్తి అని వెల్లడించారు.
టిటిడి నిధులతో ఇంట్లో ఆలయ నిర్మాణం చేసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. దేవుడు సొమ్మును దుర్వినియోగం చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి అయినా సిఎంను కలవలేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు అయిన వైసిపిలో ఎందుకు చేరుతారని.. వైసిపి అనేది ఒక మాఫియా ముఠా అని ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టిడిపి కార్యకర్తలను, పేద ప్రజలను ఆదుకున్నదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక ట్రస్ట్ ద్వారా ఎవరికైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు. తాడేపల్లి ఇంటి వైపుకు మంత్రులు,ఎమ్మెల్యే లు వచ్చే పరిస్థితి లేదని, ఇంకా సామాన్యులు సిఎంను కలిసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి టిడిపి లో చేరటం ఎంత నిజమో..యరపతినేని వైసిపి లో చేరటం అంతే నిజమని వెల్లడించారు.
పల్నాడు ప్రాంతంలో కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత 11 మంది టిడిపి కార్యకర్తలను హత్య చేశారని విమర్శించారు. వైసిపి నాయకుల అక్రమ మైనింగ్ వలన 8 మంది గుంతలో పడి మరణించారని వాపోయారు. 70 మంది కార్యకర్తలపై దాడి చేశారని,అక్రమ మద్యం తీసుకువచ్చారని,మూడు వేల ఎకరాల భూమిని ఆక్రమించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలకు సహకరించిన అధికారులకు,అడ్డగోలుగా వ్యవహరించిన వైసిపి నేతలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చేపుతామని హెచ్చరించారు. చంద్రగిరి లో 60,000 అక్రమ ఓట్లు చేర్పించారని, ఎన్ని అక్రమాలు చేసినా వైసిపిని బోంద పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తల్లి, చెల్లిని గౌరవింలేని జగన్మోహన్ రెడ్డి మహిళలను కాపాడుతావా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ,జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది అని పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత ను దెబ్బ తీయడానికి పోస్ట్లు పెడుతున్నారని ఫేక్ అకౌంట్లతో పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. 95 శాతం యువత టిడిపి,జనసేన వెంటనే ఉన్నారని పేర్కొన్నారు.రాజధానిగా అమరావతి ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తరువాత గురజాల కి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.