డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు అనంతరం ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించారో…నేడు అదే విధంగా కృష్ణ , గుంటూరు జిల్లాలో కుల చిచ్చు పెట్టేందుకు అధికార వైసిపి కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సోమవారం న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…టిడిపి అధికారంలోకి వస్తే 90 రోజుల్లో తాను అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్థానని.. అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదిక ద్వారా వైసిపి కీలక నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 19 వ తేదీన తాను టిడిపి,జనసేన ఉమ్మడి కార్యక్రమానికి చేబ్రోలు లో సమావేశం కు హజరు అయ్యానని ..ఆ సమయంలో తీసిన ఫోటో లో తాను అనని మాటలను జోడించి సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేసారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నెల 20 న పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు పోలీస్ సిబ్బంది ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి జనసేన పొత్తులో అధికారంలోకి రాలేమని వైసిపి పెద్దలు నిర్ణయానికి వచ్చాక… ఏ విధంగా అయిన సమాజంలో అశాంతి రగిలించాలని,విద్వేషాలు రెచ్చగొట్టాలని, ఆ చలి మంటల్లో రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆయన ప్రతిష్ట ను దిగజారుస్తున్న అధికార పార్టీ నాయకుల మీద సమగ్ర విచారణ జరపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ను డిమాండ్ చేశారు. నరసరావుపేట లో “టీమ్ గోపిరెడ్డి” పేరుతో, చేబ్రోలు లో “అంబేద్కర్ గ్రూప్” పేర్లతో పోస్ట్ చేశారని పేర్కొన్నారు.. మంత్రి సిధిరి అప్పలరాజు పిఆర్వో వెంకటరమణ లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలను నిజంగా కొనసాగించాలనే దృక్పథం వైసిపికి ఉంటే అసత్య ప్రచారాలు ను పోస్ట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.