గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కోరడం జగన్ రెడ్డి అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని టిడిపి పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టారని తెలిపారు. మొన్న అమరావతి, నిన్న వైజాగ్, నేడు హైదరాబాద్, మరి రేపు? ఉమ్మడి రాజధాని పేరుతో మీ బినామీ భూముల్ని కాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.
అమరావతి రాజధానిగా కొనసాగితే ఇక్కడున్న పేద ప్రజలు, రైతులు బాగుపడతారనే ఉద్దేశ్యంతోనే ఇంత నీచానికి దిగజారారని పేర్కొన్నారు. ఒక్క రాజధానే కట్టలేక మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసగించారు. ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించాలని చంద్రబాబు అనుకుంటే జగన్ దానిని ధ్వంసం చేసి మూడు ముక్కలాటకు తెరలేపారని తెలిపారు.రాజధాని నిర్మాణం నిధులన్నీ సొంత ఖర్చులకు, కేసుల మాఫీకి ఖర్చు పెట్టారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓటమికి రాజధాని అంశమే ప్రధాన కారణంగా ఉండబోతుంది అని జోస్యం చెప్పారు. జగన్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు.