ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టానికి కాల పరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఐదేళ్లలో వైసిపి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు.25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రెడ్డి 31 మంది ఎంపి లను పెట్టుకొని రాష్ట్రానికి ఏమీ తెచ్చారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.విభజన చట్టంలో కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థలను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువస్తే…వాటికి కనీసం నిధులు కూడా తెలేకపోవడం జగన్ రెడ్డి వైఫల్యం కదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా ఇవ్వలేక వేల కోట్ల కేంద్ర నిధులను నిరుపయోగం చేయడం తప్ప జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యమని పేర్కొన్నారు.
2047 కి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
స్వాతంత్రం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకొనే సమయానికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు.బడ్జెట్ నిర్ణయాలు ఆ లక్ష్య సాధన దిశగా ఉన్నాయని కొనియాడారు.మౌలిక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు.దేశ ప్రగతిని మార్చే మౌలిక రంగానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించడంతో పాటు..1.40 కోట్ల మంది యువతకు స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమానికి అమలు చేయాలనుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు.2014- 2019 మధ్య నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ కల్పనలో ఏపి దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదనీ గుర్తు చేశారు.