fbpx

రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యక నిఘా: సిఎస్

Share the content

ఎన్నికల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష సమావేశం

రాష్ట్రంలో రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం వద్ద ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి,జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సిఈఓ ముఖేష్ కుమార్ మీనాతో చర్చించారు. ఒకే ప్రాంతంలో మూడు, నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నఅధికారులు బదిలీపై ,కొత్తవారికి పోస్టింగులుకు తగిన చర్యలు తీసుకోవలని పేర్కొన్నారు.ఎన్నికల్లో డబ్బు,మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టుల ఏర్పాటుకు నిఘా అంశాలకు సంబంధించి ఒడిస్సా సిఎస్ తో సంప్రదింపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు,రవాణా,ఆర్ అండ్బి,పంచాయితీరాజ్,విద్యా,మున్సిపల్ తదితర శాఖలు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా సజావుగా సకాలంలో నిర్వహించాల్సిన ప్రక్రియని, ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ..ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి రానుందని తెలిపారు.10వ తేదీన విజయవాడలో సిఎస్,డిజిపి,సిఇఓ సహా ఎక్సైజ్,వాణిజ్య పన్నులు,ఆర్ అండ్బి,అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు గురించి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు.రాష్ట్ర ఎన్నికల కార్యాలయం,జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్ పై నియమించాల్సి ఉందని సిఇఓ చెప్పగా వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సిఎస్ సూచించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లు,మెన్ అండ్ మెటీరియల్,కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్ర ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టులున్నాయని వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు,మద్యం,గంజాయి ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నివారించవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో 76 పోలీస్ చెక్ పోస్టులు,14 అటవీ చెక్కు పోస్టులున్నాయని వీటన్నిటి ద్వారా నిఘాను మరింత వేగవంతం చేయవచ్చునని తెలిపారు.
ఈసమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్,అదనపు పిసిసిఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ యం.రవి ప్రకాశ్,రవాణా శాఖ కమీషనర్ మణీశ్ కుమార్ ఎస్ఎల్బిసి కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఆదే విధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.రాజశేఖర్,రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శి శ్యామలరావు,కమీషన్ర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్,సిడిఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *