ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో అందిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ సీవీ ప్రవీణ్ ఆదిత్య, జెడ్పీ సీఈవో ఎ శ్రీరామ చంద్రమూర్తి, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, కాకినాడ డీఎల్డీవో పి నారాయణ మూర్తిలతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ అర్జీలను సత్వరం పరిష్కారించవలసిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 378 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ కృతికాశుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని సంబందిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలనన్నారు. అర్జీదారుల సమస్యలకు సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా పరిష్కార నివేదికలకు జతపరచాలని ఆమె తెలిపారు. రీ ఓపెన్ అయ్యే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.