ముద్రగడ తప్పులో కాలేశారా? అనుకోని తప్పిదం చేసారా..? తప్పు సమయంలో.. తప్పు స్టేట్మెంట్ ఇచ్చి సొంత కాపు వర్గానికి విలన్ గా మారారా..? అంటే కచ్చితంగా మెజార్టీ కాపు యువతకు మాత్రం ప్రస్తుతం ఆయన తీరు ఏమాత్రం నచ్చడం లేదు. ప్రజారాజ్యం తర్వాత జనసేన పార్టీకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మంచి ఆదరణ పెరుగుతున్న వేళ.. రెడ్డి వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిడితే కాపు ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన ముద్రగడకు ఎందుకు కోపం వచ్చింది అన్నది కాపు యువత ప్రశ్నిస్తున్నారు . సొంత పొలానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడుతుంటే కనీసం మద్దతు ఇవ్వని ముద్రగడ ఇప్పుడు కేవలం స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని, కేవలం తన కొడుకు హరిబాబుకు వైసిపి టికెట్ ఇప్పించుకోవడం కోసం నానా యాగి చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్న మాట. కావాలని వైసిపి స్క్రిప్ట్ ప్రకారం ముద్రగడ ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నది పవన్ కళ్యాణ్ అభిమానుల మాట. పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎమ్మెల్యే ఇష్టానుసారం దుర్భాషలాడినప్పుడు ముద్రగడ ఎక్కడికి వెళ్లారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ముద్రగడ వెర్సెస్ కాపు యువత అన్నట్లు పరిస్థితి తయారయింది. నిన్న మొన్నటి వరకు ముద్రగడను కాపు నాయకుడిగా అభిమానించిన వారి సైతం ఇప్పుడు వ్యతిరేక మాటలు వస్తున్నాయి.
ఎందుకు ఈ అతి?
గతంలో పవన్ కళ్యాణ్ కు ముద్రగడకు మధ్య మంచి సంబంధాలు ఏర్పాటు చేయాలని కొందరు కాపు నాయకులు ప్రయత్నించారు. హైదరాబాదులో దీనికోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఒక హోటల్లో ప్రత్యేక చర్చలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఇరువురికి మధ్య తీవ్రమైన వ్యతిరేక భావనలు రావడంతో ఆ చర్చలు ముందుకు వెళ్లలేదు. కాపులంతా ఐక్యత కోసం ఈ చర్చలు గట్టిగా ముందుకు వెళ్లాలని కాపు నాయకులు భావించినప్పటికీ అవి అనుకున్నంత సానుకూల వాతావరణంలో సాగలేదు. తర్వాత తుని సంఘటన జరగడం టిడిపి హయాంలో ముద్రగడ కుటుంబానికి అవమానం జరగడంతో పూర్తిగా టిడిపికి ముద్రగడ దూరంగా జరిగారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపికి దగ్గర కావడం 2014 ఎన్నికల్లో టిడిపికి మద్దతు తెలపడంతో ముద్రగడ పవన్ కళ్యాణ్ విషయంలోను గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టిడిపి హయాంలో తమ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగితే కనీసం ఎవరు స్పందించలేదు అన్నది ముద్రగడ ప్రధాన ఆరోపణ. ఈ కారణం తోనే తర్వాత వైసిపికి దగ్గరే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ముద్రగడ కొడుకు హరిబాబుకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అలా అలా ముద్రగడ వైసీపీకి దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలంటే కచ్చితంగా ముద్రగడ అస్త్రం తమకు అవసరం అవుతుందని భావించిన వైసీపీ పెద్దలు ఆయనను ఒక పావుగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. దీనిలో భాగమే ప్రస్తుత కథ అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.