పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. క్షత్రియ సామాజిక వర్గం అధికంగా ఉండే ఉన్ని నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీల నుంచి క్షత్రియులే పోటీలో ఉంటారు. ఆక్వా సాగుతో ఇతర వ్యాపారస్తులు ఇక్కడ అధికం. అయితే ఇప్పుడు కీలకమైన ఉండి నియోజకవర్గం లో టిడిపి తరఫున టికెట్ పోటీ చాలా గట్టిగా ఉంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య టికెట్ ఫైట్ చాలా గట్టిగా ఉన్నట్లు బయటపడుతుంది. 2014 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కలవపూడి శివను 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పంపారు. అప్పట్లోనే కలవపూడి శివ నియోజకవర్గం మారడానికి ఇష్టం లేకపోయినప్పటికీ చంద్రబాబు డైరెక్ట్ గా మాట్లాడి ఈసారి నరసాపురం నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్లారు. ఉండి నియోజకవర్గం నుంచి ఆయన తమ్ముడు మంతెన రామరాజును నిలబెట్టడంతోపాటు కలవపూడి శివ కూడా ప్రత్యక్షంగా ఆయనకు మద్దతు పలకడంతో మొదటిసారి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉండి నియోజకవర్గ సీటును కలవపూడి శివ ఆశిస్తున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెద్దలతోనూ ఈ విషయంలో మాట్లాడారు. అయితే సిట్టింగా ఉన్న మంతెన రామరాజు అభ్యంతరం తెలపకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తన సిట్టింగ్ సీటును త్యాగం చేసి మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఇప్పుడు లేనిపోని ఆంక్షలు పెడుతున్నారని తన సిట్టింగ్ సీటును తనకు ఇవ్వాల్సిందేనని శివ కోరుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రామరాజు తన అనుచరుల వద్ద అలాగే బంధువులు వద్ద చెప్పడంతో ఇప్పుడు టికెట్ రేసులో అన్నదమ్ముల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ కనిపించేలా ఉంది. రెండు కుటుంబాలకు ఉన్న నియోజకవర్గంలో బంధువులు అలాగే అనుచర గణం చాలా ఎక్కువ. దీంతోపాటు గ్రామాల వారీగా బలాబలాలు అధికమే. దీంతో ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య టికెట్ పోరు పిల్లి పిల్లి కొట్టుకొని ఏలుక కు లాభం అన్న చందంగా తయారయ్యేలా ఉంది. ఏమాత్రం సందు దొరికినా దాన్ని వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్న వైసిపి అన్నదమ్ముల మధ్య జరుగుతున్న టికెట్ వారి విషయంలో చాలా నిశితంగా గమనిస్తోంది. గ్రామాల్లో ఇరు వర్గాలకు చెందిన వారిని వైసిపి ఎలాగోలా కలుపుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో చాలా వీక్ గా ఉన్నామని భావిస్తున్న వైసీపీ పెద్దలు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి తెలిపారు. మరోపక్క కలవపూడి శివ లోను ఇటు రామరాజులను టికెట్ విషయంలో ఏమాత్రం పట్టువిడుపులు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా వీరి మధ్య ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది.