భారతీయ జనతా పార్టీ అనుకున్నంత పని చేయబోతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న నినాదానికి కట్టుబడి ముందస్తుగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. కీలకమైన ఏ విషయాన్ని అయినా చివరి వరకు చాలా రహస్యంగా ఉంచే భారతీయ జనతా పార్టీ మరోసారి కూడా ఇదే విధానాన్ని అవలంబించనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన బిల్లులను ఆమోదించిన వెంటనే పార్లమెంటు రద్దు ప్రకటనను ప్రధాని చేయవచ్చని ఢిల్లీ నుంచి ఊహగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో పార్లమెంటును కూడా రద్దుచేసి వాటితో పాటే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మోడీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అన్నది కీలకం కానుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఒకవేళ లోక్సభ ఎన్నికలు జరిపితే ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎలా అవుతాయి అన్నది అర్ధం కావడం లేదు. ఒకవేళ ముందస్తుకు వస్తే ముందస్తు ఎన్నికలు అవుతాయి తప్ప ఒకే దేశం ఒకే ఎన్నికలు కాబోవు అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఏదైనా రాజ్యాంగ సవరణ పగడ్బందీగా తీసుకువచ్చి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల శాసనసభలు రద్దుచేసి ఒకేసారి ఎన్నికలకు వెళ్తే కనుక అది దేశంలోనే అతిపెద్ద సంచలనానికి కేంద్రబిందువు అవుతుంది. అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఒకేసారి జరిగి లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే కనుక దాదాపు ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద రాజకీయ అంశం కానుంది. దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలను సైతం మోడీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది అని, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి జరిగే కీలకమైన లోక్సభ సమావేశాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి అని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీంతో ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి కీలకమైన ప్రకటన వస్తుంది అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోపక్క ఇటీవల మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికలు ఐదు రాష్ట్రాల ఎన్నికలతోనే జరుగుతాయి అని చెప్పడం ద్వారా ఇప్పటికే ముందస్తుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయిపోయింది అని సమాచారం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదానికి కట్టుబడి కీలకమైన రాజ్యాంగ సవరణను తీసుకువచ్చి అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేస్తే కనుక అది కచ్చితంగా ఒక సంచలన అంశం కానుంది. దీనిపై ఆయా రాష్ట్రాల శాసనసభలు ఎలా స్పందిస్తాయి రాజకీయ పార్టీలు దీనిని ఏ విధంగా ఎదుర్కొంటాయి అన్నది కూడా కీలకమే. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పూర్తిస్థాయి జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తరువాతనే ఈ ప్రకటనకు బిజెపి సిద్దం అవుతోంది అని సమాచారం. దీంతో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠకు దారితీస్తోంది.