పాలనలో నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇసుక కష్టాలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇష్టానుసారం తీసుకొచ్చిన ఇసుక విధానాలు నిర్మాణ రంగాన్ని నిలువునా నాశనం చేస్తున్నాయి. పేరుకు మాత్రమే నిర్వహణ సంస్థలు తప్ప… మొత్తం వ్యవహారం చూసుకునేది వైసీపీ నాయకులే. అనైతికతకు కేంద్రంగా మారిన ఇసుక పంపిణీ వ్యవహారం భవన నిర్మాణ కార్మికుల భృతిని దెబ్బతీస్తోంది. ఇసుక ధరల దెబ్బకు నిర్మాణాలు మందగించడం, పనుల్లేక కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
• గోదావరి ప్రాంత ఇసుక తరలింపు రాజకీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ఇది చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి ఇసుక అత్యంత నాణ్యతగా ఉంటుంది. దీంతో బెంగళూరు, హైదరాబాద్, ముంబై ప్రాంతాలకు సైతం ఈ ఇసుకను తరలిస్తుంటారు. అక్కడి బిల్డర్లు మంచి డబ్బులు ఇస్తుంటారు. దీంతో గోదావరి ఇసుక దారి మళ్లుతోంది. ఇది గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రజలకు ఇది తెలుసు. స్థానిక అవసరాలకు అందని ఇసుక ఇష్టానుసారం తరలిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానికంగా అమ్ముకుంటే అతి తక్కువ ధర మాత్రమే వస్తోందని, అదే ఇతర ప్రాంతాలకు తరలిస్తే భారీగా మిగుల్చుకోవచ్చని భావించడమే ప్రధాన కారణం.
• ఇప్పటికే ఇసుక విధానం మీద భవన నిర్మాణ కార్మికులు గుర్రుగా ఉన్నారు. 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానం సక్రమంగా నిర్వహించలేదనేది రాజకీయంగా కూడా దెబ్బకొట్టనుంది. ఈ రంగం కార్మికుల్లో ఇది బాగా వ్యతిరేకత ఉంటంతో వచ్చే ఎన్నికల్లో అది రాజకీయంగానూ దెబ్బ కొడుతుందని ఉభయ గోదావరి జిల్లాల్లో అంచనాలు ఉన్నాయి. వారిని ఎలా మళ్లీ సర్దుబాటు చేయాలి..? వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక అధికార పార్టీ నాయకులు బుజ్జగించే పనులు చేస్తున్నారు. ప్రతిసారీ ఇసుక రవాణా మీద ఆరోపణలు వచ్చినా, ప్రభుత్వం కేవలం నాయకుల అవినీతి ఆస్కారంగా ఉండే విధానాలు తీసుకురావడం ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచేసింది.