నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వచ్చే ఎన్నికల్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచే అవకాశం కన్ఫర్మ్ అయినట్లే. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయ వైఖరి మీద స్పష్టత కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు
నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత అధికార పార్టీకి రఘురామ కృష్ణంరాజు పూర్తిగా దూరంగా జరిగారు. సొంత పార్టీ ప్రభుత్వం మీద ఆయన నిప్పులు జరుగుతూ ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ లు పెట్టారు. దీనిపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించి తర్వాత సిఐడి కేసులు పెట్టించి రఘు రామకృష్ణంరాజును అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న తర్వాత సిఐడి తనిమీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది అని ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనికి తగినట్లుగా రుజువులు సమర్పించారు. పార్లమెంటు సభ్యుడుగా ఉన్న తనను ఇష్టానుసారం పోలీసు కస్టడీలో హింసించారు అనడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చిని అంశం అయింది. తర్వాత కాలంలో మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గం గడప తొక్క లేకపోయారు. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారని తెలియగానే వైసీపీ ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కనీసం సొంత నియోజకవర్గంలో గెలిచిన తర్వాత కాలు కూడా పెట్టని ఎంపీగా మిగిలిపోయారు. ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిసారి ప్రభుత్వ తీరును తూర్పర బట్టడం చేస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఏ పార్టీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నది మాత్రం చెప్పలేదు. అయితే ఇటీవల రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రఘురామ సైతం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీలో సూచనలు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సైకిల్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిక్స్ అయినట్లేనా?
వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం లో జనసేన పార్టీ ప్రచారంలో ఉంటాయని ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ పోటీ చేశారు. మత్స్యకారుడైన నాయకర్ కు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు పడ్డాయి. దీంతో మరోమారు న్యాయకరణ అక్కడి నుంచి నిలపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతోనే జనసేన పార్టీలో చేరాలని భావించిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం వెనకడుగు వేసినట్లు సమాచారం. కచ్చితంగా ఈసారి నాయకులకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆలోచించడంతోనే మరొకరికి అవకాశం ఉండదు అన్న కోణంలో కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ వైపు అడుగులు వేయకుండా స్థిరంగా ఉన్నారు అన్నది రాజకీయ వర్గాల మాట. దీంతో వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజుకు తెలుగుదేశం పార్టీ టికెట్ దాదాపు ఖరారు అయినట్లేనని నర్సాపురం ప్రాంతంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.