జూన్ 2 తరువాత తెలంగాణలో ఉన్న ఏపి భవనాలను స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం మంచి విధానం కాదని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధానిగా వున్న హైదారాబాద్ ను జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా వుంటుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తగదన్నారు. రాష్ట్ర విభజన వలన 2014 నుండి పదేళ్లు ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదారాబాద్ ను పార్లమెంట్ నిర్ణయం చేసింది. పార్లమెంట్ లో సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా ఏపి కి ప్రకటించలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఫలితాలు అందలేదు. పదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం కానందున హైదారాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పరిగణన చేస్తూనే ఆంధ్రప్రదేశ్ భవనాలను లాక్కోకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. ఉమ్మడి రాజధాని పై రాజకీయ పార్టీలు ఏకీకృతమై కాపాడు కోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర హక్కులను ఆస్తులను కాపాడు కోవాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.