జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు వైసీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిస్థాయి ప్రాణహాని ఉన్నట్లు బలంగా భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి జనంలోకి రానున్న వారాహి యాత్ర ద్వారా ఆయన పటిష్టమైన భద్రతను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్పీజీ తరహాలో భద్రత ఏర్పాట్లు చూడాలని ఇప్పటికే చెప్పారు. ప్రభుత్వం కావాలనే భద్రత వైఫల్యాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వారాహి యాత్రలో అనుకోకుండా వైసిపి కార్యకర్తలను ప్రవేశపెట్టి గొడవ చేయించే అవకాశం కూడా ఉందన్న సమాచారంతో మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రాణహాని ఉందనే సమాచారం
వారాహి యాత్రకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో పూర్తిస్థాయి అనుమతులు రాలేదు. యాత్రకు అనుమతి ఉన్నా లేకున్నా సరే ఖచ్చితంగా 14వ తేదీన మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతోపాటు పోలీసులు తమకు ఇతర విధులు ఉన్నాయన్న నెపంతో వారాహి యాత్రకు కేవలం నామమాత్రపు భద్రత కల్పించేలా ప్రభుత్వం ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారాహి యాత్రకు పూర్తిస్థాయి రూట్ మ్యాప్ ను కూడా పోలీసులు చివరి నిమిషంలో భద్రతా కారణాలను చూసి మార్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతను పెంచుకునేందుకు ఎక్కువగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా యాత్రలో మూడంచల భద్రత విధానాన్ని అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయిలో దిశా నిర్దేశం చేశారు. వారాహి యాత్ర రోడ్ షో సమయంలో ఫాన్స్ హడావిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో, అదే సమయంలో వారాహి మీదకు వైసిపి కార్యకర్తలు అభిమానుల ముసుగులో దాడులు చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ కు కీలకమైన సమాచారం వచ్చింది. దీంతో ఖచ్చితమైన భద్రత అలాగే అభిమానుల్లోనే కొందరిని భద్రతా సిబ్బందిని ఉంచి ప్రతి ఒక్కరిని వాచ్ చేసే విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చే వారిని సైతం పూర్తిస్థాయి తనిఖీలు అనంతరం వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ అనుమతితో దగ్గరికి పంపే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న భద్రతా లోపం లేకుండా ఎవరికి సమస్య రాకుండా చూడాలని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి స్వయంగా పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కీలకమైన ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో ఎలా మెసులుకోవాలో కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఇస్తున్నారు. వైసిపి కావాలనే చిన్న విషయాలు కూడా పెద్దది చేయాలని చూసే అవకాశం ఉందని అభిమానులు ముసుగులో చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే వైసిపి కరుడుగట్టిన కార్యకర్తలు, సుపారి గ్యాంగులు కూడా చొరబడే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అంశం తేడాగా కనిపించిన వెంటనే స్పందించేలా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. వారాహి యాత్ర మొత్తం వ్యక్తిగత భద్రత సిబ్బందిని నమ్ముకొని ఆయన ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండదని ముందుగానే భావించిన పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.