రాజకీయాల్లో ఎప్పుడూ అత్యుత్సాహం పనిచేయదు. కేవలం సినీ ఫాలోయింగ్, క్రేజ్ వల్లనే ఓట్లు రాలిపోతాయి అనుకోవడం భ్రమ. దీనిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగానే గుర్తించారు. మాన్యశ్రీ కాన్షిరాం అన్నట్లు రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు గుర్రం మీద ప్రయాణించడమే నేర్చుకోవడం సరికాదు.. ఒక్కోసారి గాడిద మీద ప్రయాణించి అయినా గమ్యస్థానం చేరుకోవాలి అంటారు. కాన్సిరాం లాంటి గొప్ప నాయకుల మాటలకు ప్రభావితం అయ్యే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఓ పార్టీకి అధికారం లేకుండా సుమారుగా 10 ఏళ్లపాటు పార్టీని నడపడం చిన్న విషయం కాదు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అత్యున్నత లక్ష్యం. 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయానికి దశాబ్దకాలం పూర్తి చేసుకుంటారు. ఎన్నికల్లో కూడా ఆయన ఏమాత్రం ప్రభావం చూపకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత చులకన అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని బలంగా బుర్రలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అదే మాట మీద కట్టుబడి ప్రతి సారి సంపూర్ణ క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు ఎవరి మధ్య పోటీనో కూడా తేల్చేశారు. ముఖ్యంగా అత్యంత ఆవేశపరులైన జనసైనికులను ఆయన మానసికంగా అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మన బలం ఏంతో చూపిద్దాం..
పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడే సమయంలో బలంగా వచ్చే ఆరోపణలు మాటల మీద ఖచ్చితంగా చర్చిస్తారు. దానిమీద ఒక క్లారిటీ ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన బలం చూపించిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠం అడగాలి అన్నది జనసేనని ఆకాంక్ష. దీనికి అనుగుణంగా పని చేద్దామని చెప్పడం ద్వారా అన్ని స్థానాల్లో పనిచేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు అని కూడా తేల్చేశారు. గత ఎన్నికల్లో 134 స్థానాల్లో పోటీ చేసి ఏం సాధించాం అని కూడా ప్రశ్నించారు. అప్పటికీ ఇప్పటికీ పార్టీ గ్రాఫ్ పెరిగింది గాని అది గెలిచేంత పెరగలేదు అని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. పూర్తిస్థాయిలో పార్టీ అధికారం చేపట్టే అంత బలం రాష్ట్రంలో పెరగలేదు అన్నది ఆయన లెక్కలతో సహా చెప్పారు. కొన్ని జిల్లాల్లో బలంగా నిలబడ్డామని మరికొన్ని జిల్లాల్లో చతిగల పడ్డామని కూడా ఒప్పుకున్నారు. దీని ద్వారా జనసేన పార్టీ పూర్తిస్థాయిలో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కచ్చితంగా అయితే అవ్వాలి అనుకుంటున్న జనసేన పార్టీ శ్రేణులకు ఆయన గొప్ప విషయాలు అర్థమయ్యేలా చెప్పారు. వాస్తవ స్థాయి పరిస్థితిని బహిరంగంగా వివరించారు. కచ్చితంగా అధికారం చేపట్టాలి అనే అంతిమ లక్ష్యానికి ఒక్కోసారి గుర్రం మీద వెళ్లాలా.. గాడిద మీద వెళ్లాలా అనేది ముఖ్యం కాదని లక్ష్యం చేరుకోవడం ముఖ్యం అని ఆయన చెప్పారు కూడా… అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాటలను వివిధ రకాలుగా అర్థం చేసుకున్న కార్యకర్తలు ఉన్నారు. అలాగే వైసిపి చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ నమ్మే కార్యకర్తలు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న వారు మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సంపూర్ణ రాజకీయాన్ని స్వాగతిస్తున్నారు. కచ్చితంగా జనసేన పార్టీ బలం పుంజుకోవాలి అంటే పొత్తులు ఉపయోగపడతాయి అని జనసేనని నమ్మినట్లు జనసైనికులు నమ్మితే ఆ పార్టీ భవిష్యత్తులో కచ్చితంగా అధికారం చేపట్టడం మాత్రం ఖాయం.