పార్లమెంట్ లోకి బుధవారం అనుమానిత వ్యక్తుల ప్రవేశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా 22 ఏళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈసారి ఏకంగా లోక్ సభ సమావేశ హాలులోకే ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది. ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు. బీజేపీకే చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు నిందితులు ఎటువంటి ప్రమాదకర ఆయుధాలు ప్రదర్శించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి అంతా ఊపిరిపీల్చుకున్నారు. డిల్లీలో జరిగిన ఘటనపై నిందితులను భద్రతా బలగాలు ప్రశ్నిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నాయి. అదే సమయంలో ఈ ఘటన ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. వివిద రాష్ట్రాల నుంచి విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టిన వారి వివరాలు సేకరించే పనిలో నిఘా వర్గాలు పడ్డాయి. ఈ వివరాలు ఆరా తీస్తే ఏపీలో ఓ ఆసక్తికర వ్యవహారం బయటపడింది. ఏకంగా రౌడీ షీటర్ ఒకరు సభలో ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.
- సంతలో సరుకుల్లా పార్లమెంట్ పాసులు
పార్లమెంట్ లో జారీ చేసే పాసులు సంతల్లో సరుకుల్లా అమ్మకాలు జరుగుతున్నాయనే అనుమానాలను పెంచుతున్నాయి. తన సిఫార్సుతో ఎవరు సభలో అడుగుపెడుతున్నారనే అంశం సదరు సభ్యుడికి తెలియకపోయినా, పాసులు మంజూరు అవుతున్నట్టు తాజా ఘటనలో బయటపడింది. భారత అత్యున్నత చట్టసభల్లో అత్యంతం భద్రత ఉంటుంది. కానీ అందులో ఢొల్లతనం తాజా ఘటన బయటపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిపేరు మీద రౌడీ షీటర్ నూకల సాంబశివరావుకు పార్లమెంట్లో ప్రవేశానికి ఈ నెల 8వ తేదీన పాస్ జారీ అయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కీ చెందిన రౌడీషీటర్ కు పార్లమెంట్లోకి ప్రవేశానికి పాస్ జారీ అయినట్లు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.ఇతనిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోను అనేక కేసులు నమోదు అయ్యాయి.ఇంత క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్లమెంట్ పాస్ జారీ అవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ పోలీసులు విచారణ వ్యక్తం చేస్తున్నట్లు అత్యంత విశ్వాసనీయంగా తెలిసింది.
ఏపీలో అలాంటి వారి జాబితా వెల్లడయితే ఎవరెవరు అందులో ఉన్నారన్నది తెలుస్తుంది.