మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని దానికి సంబంధిత వ్యాధులు వచ్చేటప్పుడు ముందుగా గుర్తిస్తే నివారించుకోవడం సులభతరమని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు సూచించారు. ప్రపంచ కిడ్నీ నివారణ దినోత్సవం సందర్భంగా కాకినాడ లో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులు సమావేశంలో కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురుంచి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…మానవ శరీరంలో కిడ్నీ ఒక కీలక అవయవమని దానిని నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు.ప్రతి ఆరు నెలలకు ఒక సారి కిడ్నీ పనితీరు కి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.పిల్లలలో ఉదయం మొహం వాచినా, సాయంత్రం వేళల్లో కాళ్ళు ఉబ్బినా కిడ్నీ పనితీరు సరిగా లేదని తెలుసుకోవాలని అన్నారు.మూత్రం రంగు మారినా కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నట్టు గుర్తించాలని అన్నారు.సరైన ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని వివరించారు.ప్రమాదకరమైన ఇంగ్లీష్ మందులు అధికంగా వాడడం వలన కిడ్నిలపై ప్రభావం పడటం వలన పని తీరు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ తగిన మోతాదులో మంచి నీళ్ళు త్రాగాలని,బిపి,చక్కెర వ్యాధులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు అనిల్ కుమార్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.