2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈసారి దాదాపుగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండే అవకాశం లేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి నాగబాబు తీసుకువెళ్లినట్లు, వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత కార్యక్రమాలను చూసుకుంటానని ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం పాల్గొనే అవకాశం వద్దని నాగబాబు కోరుకుంటున్నారు.
ఇప్పటికే కీలకంగా..
జనసేన పార్టీలో నాగబాబు స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు ఇటీవల ఆయనకు పిఎసి మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా పార్టీలో కీలకము కావడంతో నాగబాబు ఆ హోదాతో రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. వర్చువల్ మీటింగ్స్ ఇటీవల నియోజకవర్గాల వారీగా పెట్టిన నాగబాబు వాటిని కొనసాగిస్తు, పార్టీ అంతర్గత కార్యక్రమాలు ఆర్థిక కార్యక్రమాలు చూసుకొనేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు రెండు లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అయితే మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నరసాపురం లోక్సభ పరిధిలోనే ఉన్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేది లేదని నాగబాబు తెల్చి చెప్పినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో సైతం పోటీ చేయనని పవన్ కళ్యాణ్ కు చెప్పిన చివరి నిమిషంలో ఖచ్చితంగా చేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతోనే ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పూర్తిగా పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లోనే పాలు పంచుకుంటానని నాగబాబు ఇప్పటికే తేల్చి చెప్పేసినట్లు సమాచారం.