లోక్సభ సభ్యుడు అంటే సుమారుగా ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఢిల్లీ స్థాయిలో దేశం మొత్తం వినపడేలా ప్రస్తావించాలి. పార్లమెంటులో ఆ నియోజకవర్గం తాలూకా వాణి బలంగా వినిపించాలి. అసలు నియోజకవర్గానికి ఎంపీ ఉన్నారో లేరో అన్న భ్రమను ఆ ఇద్దరు మహిళ ఎంపీలు కలిగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అధికార పార్టీ వైసీపీ నుంచి గెలిచిన కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింత అనురాధలు అసలు పదవుల్లో ఉన్నారో లేరో కూడా అందుబాటుని విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
అసలు గొంతు రాదు
అప్పటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా వంగా గీతకు కాకినాడ ఎంపీ సీటును వైసీపీ కేటాయించింది. రాజకీయ అనుభవం ఉన్న గీతకు కాకినాడ ఎంపీ పదవి అనూహ్యంగానే దక్కింది అని చెప్పాలి. అలాగే అమలాపురం ఎంపీగా చింత అనురాధ కూడా అనూహ్యంగానే తెరమీదకు వచ్చారు. అప్పటివరకు కనీసం ఏ రాజకీయ పదవి నిర్వహించని అనురాధ అప్పటికప్పుడు వైసీపీ కేవలం ఆర్థిక బలం చూసి మాత్రమే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో వైసీపీ గాలికి వీరిద్దరికి మంచి మెజారిటీతో ఎంపీలయ్యారు. 2019 నుంచి ఇప్పటివరకు కనీసం నాలుగు సంవత్సరాల్లో వీరిద్దరూ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కనీసం ప్రెస్ మీట్ లు, పార్టీ కార్యక్రమాల్లోనూ అంతంత మాత్రమే పాల్గొంటున్నారు. ఇక జిల్లా సమీక్ష సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వీరిద్దరి ప్రమేయం లేదని చెప్పాలి. గెలిచిన తర్వాత వీరిద్దరూ అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే కనీస సమాచారం కూడా లేని పరిస్థితి నెలకొంది.
పార్లమెంట్ లో అంతేనా?
పార్లమెంట్ లోను ఈ ఇద్దరు మహిళ ఎంపీలు మాట్లాడింది లేదు. స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించింది లేదు. జాతీయ సమస్యల మాట దేవుడెరుగు కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని మీద కూడా వీరిద్దరూ యాక్టివ్గా ఎప్పుడూ స్పందించలేదు. కేవలం పార్లమెంటు హాజరీ వేయించుకోవడానికి వెళ్లడం తప్పితే, ప్రజా సమస్యలు వీరిద్దరి కు పట్టవు అని చెప్పొచ్చు. రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న వంగా గీత కూడా తర్వాత సైలెంట్ అయిపోవడం, కీలకమైన పదవిని ఆమె పటిష్టంగా నిర్వహించలేదు అన్న అపప్రదను మూటగట్టుకున్నట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలకు మళ్లీ అవకాశం ఇచ్చేది తక్కువే అన్నది వైసీపీ నాయకుల మాట. వంగ గీతకు వచ్చే ఎన్నికల్లో ఏమైనా అవకాశం ఇవ్వవచ్చు గాని, చింత అనురాధను పూర్తిగా పక్కకు పెట్టవచ్చు అని భావిస్తున్నారు.