ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ వాతావరణం క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తల భౌతిక దాడులు నాయకులు సాక్షిగా జరగడం నాయకుల సమక్షంలోనే ఇష్టానుసారం దాడులకు తగబడడం ఇప్పుడు పోలీసు వర్గాల తో పాటు సామాన్య ప్రజలను సైతం కలవరపరుస్తోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది మరిన్ని గొడవలు జరుగుతాయన్న నిఘా వర్గాల సమాచారం ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి పూర్తి అండదండలు అందించడంతో విపక్షాలు, ఆ పార్టీల కార్యకర్తలు చిరుబుర్లు ఆడుతున్నారు. ఏ విషయం జరిగిన విపక్ష పార్టీల తప్పు అన్నట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఇది సరికాదు అంటూ వారు చెబుతున్నారు.
తాజాగా పుంగనూరులో చంద్రబాబు కార్యక్రమంలో జరిగిన దాడి, మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇంకా గొడవలు జరుగుతాయి అని చెబుతున్న తీరు చూస్తుంటే రాబోయే మరికొద్ది నెలలు ఆంధ్రప్రదేశ్ కు శాంతిభద్రతలపరంగా కీలక సమయంగా భావించవచ్చు. పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే ఈ గండం దాటి బయటపడే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా కేవలం ఒక పార్టీ తరఫున ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో టర్న్ తీసుకుంటే క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు కూడా తప్పని పరిస్థితుల్లో అటువైపే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఏకపక్షంగా ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎన్నికలకు సుమారు 8 నెలల సమయం ఉండగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి హీటెక్కింది. ఒకపక్క చంద్రబాబు టూర్లు చేస్తుంటే మరోపక్క లోకేష్ పాదయాత్ర ఇంకోపక్క పవన్ వారాహి యాత్ర రాష్ట్రంలో వేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ వైసీపీ నేతలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. నేతల పర్యటనలకు అడ్డు తగులుతూ అక్కడ ఏదో ఒక గందరగోళం సృష్టించేలా వారు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. సామాన్యులు దీనిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎప్పటికే అత్యంత అగమ్య గోచరంగా తయారవుతుండడం మరోపక్క రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉండడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న బెంగ సామాన్యుడికి పట్టుకుంది. రాజకీయ పార్టీలు వారి వారి పార్టీల సిద్ధాంతాలవారీగా మాట్లాడుకోవాలి తప్పితే, భౌతికంగా దాడులు చేసుకోవడం, రోడ్లపై పడి గొడవలు దిగడం వల్ల సామాన్యులు బతుకు బండి పూర్తిగా చితికి పోయే ప్రమాదం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అన్ని రంగాల ప్రజలు ఉపాధి మీద దెబ్బ పడింది. మధ్యలో కరోనా రోజులు పేదలకు పూర్తిగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇప్పుడిప్పుడే ఆ రోజు నుంచి బయటపడుతున్న పేదలకు సామాన్యులకు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అల్లకల్లోలం భవిష్యత్తు మీద బెంగను మరింత పెంచుతోంది.