రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలును కాపాడటంలో పోలీస్ యంత్రాగం విఫలం చెందిందని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాలని భావించిన ఎన్నికల కమిషన్ … ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను మార్చి ఏమీ సాధించింది? ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించారా ? శాంతి భద్రతలు కాపాడారా ? అని ప్రశ్నించారు. నరసరావుపేట పార్లమెంట్లో వైసిపి కార్యకర్తల ఆర్తనాదాలపై పోలీసులను పంపించలేని ధీన స్థితిలో తాము ఉన్నామని అన్నారు.తాము ప్రభుత్వంలో ఉన్నామా? లేమా? అర్థం కాని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపితో పోలింగ్ ఆఫీసర్లు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ధమ్మాలపాడులో 253,254, నార్ని పాడు, 236,237, చీమల మర్రి పోలింగ్ 197,198 పోలింగ్ కేంద్రాల్లో టిడిపి రిగ్గింగ్ కు పాల్పడింది అని ఆరోపించారు. ఆయా కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ తనిఖీ చేసి రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. మంగళవారం సత్తెనపల్లి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెరిగిన ఓటింగ్ వ్యతిరేకత కాదు….సానుకూలతనే
రాష్ట్రంలో అత్యధిక స్థానాలతో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు.ఐదేళ్ల పరిపాలన తర్వాత తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా ? 14 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబు కే అధికారం కట్టబెట్టాలన్న అంశం మీదే ఎన్నిక జరిగిందని అన్నారు.మహిళలు 70 శాతానికి పైగా వైసిపి కే పట్టం కట్టారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేసినందుకే మహిళలు వైసిపికి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన ఓటింగ్ శాతం వైసిపికి సానుకూలతగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలన్న తాపత్రయంతో గంటల తరబడి వృద్ధులు,వికలగంగులు, క్యు నిలుచున్నారన్నారు.ఎన్నికల మేనిఫెస్టో ను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి.ఇచ్చిన ప్రతి మాటను చెత్త బుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.