శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవ హార్ రెడ్డికి లేఖ రాశారు. ఏకారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదని,అయితే ముర్షావలి లేవనెత్తిన సమస్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావలి వివరించారని తెలిపారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోందని తెలిపారు. వీడియో ద్వారా ముర్షావల్లి వెల్లడించిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్య చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సస్పెన్షన్ ఆర్డర్ను వెంటనే ఉపసంహరించుకుని సమస్య మూలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ముర్షావలి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు.