తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లో వచ్చిన రాజకీయ పరిణతి ఇప్పుడు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యంలో ముంచేత్తుతోంది. ముఖ్యంగా సమకాలీన రాజకీయాలను ఆయన వంట పట్టించుకున్న తీరు.. పార్టీ కాష్టకాలంలో ఆయన వ్యవహరించిన తీరు అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతున్న తీరును చూసి లోకేష్ పూర్తిస్థాయిలో కీలకమైన నేతగా ఎదిగారని నేతలు మాట్లాడుకుంటున్నారు. అలాగే పార్టీలోని సీనియర్లను లోకేష్ గౌరవిస్తున్న తీరు వారికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు కూడా పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో లోకేష్ మాట్లాడితే ఇతర పార్టీలకు అది ట్రోలింగ్ కింద ఉపయోగపడేది. అయితే ప్రస్తుతం లోకేష్ సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడమే కాక జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇస్తున్నారు. అందులోనూ తెలుగు మాట్లాడడంలో లోకేష్ కు స్పష్టత కూడా పెరిగింది. ప్రతి అంశాన్ని తెలుసుకుంటూ మెల్లమెల్లగా పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన లోకేష్ పట్టుదల కచ్చితంగా స్ఫూర్తివంతం అని చెప్పాలి.
** లోకేష్ బరువు 120 కేజీల వరకు ఉండేది. అలాగే మొదటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న లోకేష్ తెలుగు పలకడానికి చాలా కష్టపడేవారు. ఇక మొదట్లో రాజకీయపరంగా కూడా ఆయన దూకుడుగా వ్యవహరించేవారు. పార్టీలో చంద్రబాబు తర్వాత నేనే అనేలా ఆయన ఏకపక్ష ధోరణి ఉండేది. లోకేష్ లోని అన్ని ప్రతికూలతలను మెల్లమెల్లగా ఆయన అధిగమించిన తీరు దానికోసం చంద్రబాబు ఇచ్చిన తర్ఫీదు నిజంగా గొప్ప విషయమే. భాష విషయంలో కానీ బరువు విషయంలో కానీ అలాగే పార్టీని నడిపించే విషయంలో కానీ లోకేష్ ఆలోచన తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయం అవుతుంది. కచ్చితంగా లోకేష్ ఇదే తీరును ముందుకు వెళ్తే పార్టీ పగ్గాలు కూడా సులభంగానే అందుకుంటారని దానిని నడిపించే తీరు అలాగే వ్యవహరించాల్సిన తీరులో లో కాస్త స్పష్టత వస్తే కచ్చితంగా చంద్రబాబు వారసత్వం అందుకొని తెలుగుదేశం పార్టీ పగ్గాలను తెలుగు రాష్ట్రాల్లో నడిపించగల నేతగా లోకేష్ తయారవుతారు అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ వ్యవహరించిన తీరు కూడా చాకచక్యంగా అనిపించింది. మొదట్లో లొకేషన్ కూడా జైల్లో వేస్తారని ఖచ్చితంగా కేసు నమోదుకు రంగం సిద్ధం అయిందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికప్పుడు చంద్రబాబు సూచనలతో లోకేష్ ఢిల్లీ వెళ్లి అక్కడ కీలక మంత్రంగం జరిపారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న వెంటనే లోకేష్ తగిన విధంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న జనాదరణను గమనించిన లోకేష్ పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. కాస్త వెనక్కు తగ్గుతూ వ్యవహరించినప్పటికీ అది రాజకీయ మార్పులో భాగమే అనేది స్పష్టం. రెండు పార్టీల సమన్వయ భేటీలో సైతం లోకేష్ హుందాగా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన తీరు అక్కడే వున్న సీనియర్లను ఆయన గౌరవించుకున్న తీరు కూడా లోకేష్ లోని రాజకీయ పరిణతిని చూపుతోంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది లోకేష్ వ్యవహరిస్తున్న తీరు అలాగే ఆయన భవిష్యత్తు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే తీరుపైనే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని తప్పక చెప్పాలి.