వామపక్షాల్లో కీలకమైన సిపిఎం పార్టీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిపిఎం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు వస్తుందేమో అని ఆశగా ఎదురుచూసిన వామపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైన సంకేతాలు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని సంకల్పించింది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి వచ్చే ఎన్నికలకు వెళ్తాయని తేలిపోవడంతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కచ్చితంగా బిజెపికి తాము అనుకూలంగా ఉంటామని తేల్చి చెప్పారు.
తమ కోటమి తరఫున గెలిచే అభ్యర్థులు కచ్చితంగా బిజెపికి మద్దతు ఇస్తారు అని చెప్పడం ద్వారా సిపిఎం పార్టీ కచ్చితంగా వారితో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం అని తేల్చి పారేసింది. బిజెపికి అనుకూలంగా ఉండే శక్తులకు పూర్తిగా దూరంగా ఉండే సిపిఎం పార్టీ తన సిద్ధాంతాల్లో భాగంగా కచ్చితంగా ఈ కూటమితో కలిస్తే నష్టపోతామని భావిస్తూ.. ఈసారి ఒంటరి పోరుకు సిద్ధం అవుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాలు ఏడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఇటీవల సమావేశంలో తేల్చి చెప్పారు. అయితే వామపక్షంలోని కీలకమైన సిపిఐ పార్టీ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. సిపిఐ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు సిపిఎం నడిచిన బాటలోనే సిపిఐ కూడా నడుస్తుందా లేక ఎక్కడైనా కాస్త కాంప్రమైజ్ అయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుందా అనేది చూడాలి.