కాకినాడ నగరం అచ్యుతాపురం రైల్వేగేటు దగ్గర రాములు వారి ఆలయం బయట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ఒక వ్యక్తికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష విధిస్తూ కాకినాడ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ తీర్పును వెలువరించింది.2022 డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనపై అప్పటి ఆలయ ఈవో నాగ సుబ్రమణ్య శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్థానిక విశ్వ హిందూ పరిషత్,భజరంగ్ దళ్, హిందూ సంఘాలు నాయకులు ఆందోళనలు చేశారు.
కేసు నమోదు చేసిన కాకినాడ రెండవ పట్టణ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు, ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేసి కురకాల శ్రీనివాస్(40) ను నిందితుడిగా గుర్తించారు. నిందితుడిపై క్రైం నెంబర్ 294/2022, 436,427 సెక్టన్ల కింద కేసు నమోదు చేసి 2022 డిసెంబర్ 26న అరెస్ట్ చేశారు. కాకినాడ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ లో విచారణ అనంతరం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.వెంకటేశ్వరరావు ముద్దాయికి పద్దెనిమిది నెలల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ప్రకటించారు. ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పిపి కే.రాధాకృష్ణ రాజు వాదించారు. కాకినాడ టూటౌన్ కోర్ట్ ఏఎస్ఐ మీసాల సత్యనారాయణ ప్రాసిక్యూషన్ వారికి సహకరించారు.