కాకినాడ జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరుగా ఎన్వీవి సత్యనారాయణ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎన్ఎఫ్సీయల్ రోడ్డులోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆయనకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్లు సత్వరం నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలు అనుసరించి గృహ నిర్మాణ సంస్థను రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా ఎన్వీవి సత్యనారాయణ ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేస్తూ తొలుత పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సీఈవోగా,కాకినాడ జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గా బదిలీ అయ్యారు. కారణాలు ఏమైనా బదిలీ అయిన రెండు చోట్లా బాధ్యతలు స్వీకరించడానికి పలు ఆటంకాలు ఎదురయ్యాయి.దీనితో ఆయనకు ఎక్కడా పోస్టింగ్ లేకుండా ఉండిపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరుగా నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయం సిబ్బంది తదితరులు అభినందించారు.