రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, నల్లం శ్రీనివాస్, గట్టి సత్యనారాయణ, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, గుత్తుల రమణలు విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాకినాడలో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం, అక్రమాలు, భూకబ్జాలు జరగవని హామీ ఇచ్చారు. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన, కాకినాడ పోర్టు అభివృద్ధి, డ్రైనేజీ తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబాలు దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయాలని కోరారు.