భారీ జన సందోహంతో కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. బుధవారం తన కార్యాలయం నుండి భారీ జన సందోహంతో ర్యాలీగా ఉదయ్ శ్రీనివాస్ బయలుదేరారు. మేళ తాళాలు, కొమ్ము డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెయిన్ రోడ్డు దగ్గరకి ర్యాలీ హాజరయ్యే సమయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ తోడయ్యారు. అక్కడి నుంచి భారీ ఎత్తున జన సమీకరణతో మెయిన్ రోడ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. అనంతరం అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తమ నామినేషన్ను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల బాగు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీలు జతకట్టాయని ఇది తమ కోసమేనని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరించారు. ఉదయ్ శ్రీనివాస్ చిన్న స్థాయి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగారని ఆ విధంగానే కాకినాడ పార్లమెంటు ను అభివృద్ధి పదంలో ముందు ఉంచుతారని నమ్ముతున్నానన్నారు. ఒకప్పుడు కాకినాడలో ప్రశాంత వాతావరణంగా ఉండేదని ప్రస్తుతం గంజాయి, మాఫియాలకు కేంద్ర బిందువుగా మారిందన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి కాపాడి ….జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు), తోట సుధీర్, బుర్ర కృష్ణంరాజు, బోళ్ళ కృష్ణ మోహన్, ఉండవల్లి వీర్రాజు, టీవీ రామారావు, వరుపుల తమ్మయ్య బాబు తదితర కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.