రాజకీయ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఓపిక చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో ఒక భాగమైన ఎన్నికల వ్యవస్థలో ప్రజల తీర్పు ఎప్పటికప్పుడు మారవచ్చు, లేక స్థిరమైన ప్రభుత్వాన్నే వారు ఎన్నుకోవచ్చు. అంతిమంగా ప్రజా తీర్పును నాయకులు గౌరవించాలి. దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు నడవాలి,ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ బలమైన ప్రతిపక్ష పాత్రను వారు పోషించాలి, ప్రజల అభిమానాన్ని వారు చూరగొనాలి. అంతిమంగా అనుకున్న లక్ష్యాలను సాధించాలి. ఈ ప్రయాణంలో చివరకు వరకు ఉన్నవారే విజేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి,కొణిజేటి రోశయ్య,నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ సుధీర్ఘ ప్రయాణంలో తమ విధేయతను చూపించి అనుకున్న లక్ష్యాలను సాధించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పదమూడు ఏళ్ల సమయం పట్టింది. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం లోకి వచ్చారు. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినవారిలో పెమా ఖండు,అఖిలేష్ యాదవ్,మాయావతి ఉన్నారు.ఒక జెడ్పీటీసీ నుంచి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి 16 ఏళ్లకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నిరంతరం ప్రజలతో సంబంధాలు కలిగి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వారిని వదులుకోరు అనేదానికి రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ. జెడ్పీటీసీ,ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే,ఎంపి,ముఖ్యమంత్రి ఇలా ప్రతి పదవిలోను ప్రజలతో రేవంత్ రెడ్డి నిరంతరం మమేకమయ్యారు. సినీ రంగం నుంచి వచ్చినవారిలో ఎన్టీఆర్,ఎంజీఆర్, జయలలిత మరి కొంతమంది మినహాయించి ఎవరు ఎక్కువ కాలం రాణించలేక పోయారు.చిరంజీవి ,కమలహాసన్,విజయ్ కాంత్ ఎవరు అనుకున్న ప్రభావం చూపించలేక పోయారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలిపి చివరకు తనకు రాజకీయాలు సరిపడవని భావించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయి, తన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే నే గెలుపొందారు. అయినా తన ప్రయానాన్ని ముగించలేదు.
- సుదీర్ఘమైన పొత్తుతోనే జనసేనకు మిత్ర లాభం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. తన ప్రసంగంలో పదే పదే టిడిపి,జనసేన పొత్తు సుధీర్ఘ కాలం కొనసాగాలి అని పేర్కొన్నారు. ఒక నెల క్రితం చెప్పిన మాట కంటే భిన్నంగా,మెరుగ్గా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.నెల క్రితం పది సంవత్సరాలు పాటు టిడిపి,జనసేన పొత్తు కొనసాగాలి అని కార్యకర్తలకు చెప్పిన పవన్ ఇప్పుడు సుధీర్ఘ పొత్తు ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత కూటమి అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గా చెప్పట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశం తన పార్టీ నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకువెళ్లడం మాత్రమే. అనంతరం పార్టీ క్షేత్ర స్థాయిలో బలపరచి 2029 కి పొత్తులో భాగంగా 60 నుంచి 75 స్థానాలు పొంది అసెంబ్లీ లో కీలకంగా వ్యవహరించనున్నారని సమాచారం. ఆ తరువాత మాత్రమే ముఖ్యమంత్రి పదవిని పవన్ చేపట్టే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో వైసిపి బలంగా ఉన్న తరుణంలో టిడిపి, జనసేన పొత్తు ఘర్షణలు లేకుండా కొనసాగితే అధికారం తధ్యమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పది ఎండ్లు పాటు కూటమి పొత్తు కొనసాగితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ సిఎం అయ్యేందుకు పరిస్థితులు ఉన్నాయని జనసేన సీనియర్ నాయకులు భావిస్తున్నారని సమాచారం.అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ యువగళం సభకు మిత్ర స్థాయిలో వచ్చారని, టిడిపి,జనసేన క్యాడర్ ని ఒక వేదిక మీదకు తెచ్చారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.