ఆర్ధిక వ్యవస్థ ఎప్పుడు సైకిల్ చైన్ మాదిరి తిరుగుతూ ఉండాలి. దేశంలోని మానవ వనరులు ఉపయోగించుకొని వారికి తగిన సంపద సృష్టి జరగాలి. ఆ సంపద మార్కెట్లో మళ్లీ రీ వినియోగం జరిగి ప్రభుత్వ ఖాతాకు పన్నుల రూపంలో చేరాలి. ఇది ఎక్కడ గాడి తప్పకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ఆర్థిక సూత్రానికి భిన్నంగా పాలన జరుగుతోంది. జగన్ డబ్బుల మంత్రం కనుక వచ్చే ఎన్నికల్లో ఫలిస్తే ఖచ్చితంగా ఆ పై ఎన్నికల నుంచి ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు ఎంతో కొంత నగదు ఇస్తామని హామీలు తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడే అవకాశం ఉండదు. జగన్ సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తే మేము రెండు లక్షలు ఇస్తామంటూ ప్రతి పార్టీ హామీలు ఇవ్వడమే మిగులుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలమే కాక రాష్ట్ర భవిష్యత్తు పూర్తిస్థాయిలో నాశనం అవుతుంది. వచ్చే ఎన్నికలు కచ్చితంగా భవిష్యత్తును నిర్ధారించేవి అని మాత్రం చెప్పొచ్చు.
వెనిజుల పతనం
ఒకప్పుడు అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా తల తూగిన వెనిజులా దేశం ఉచిత పథకాలకు ప్రజలను దించి పూర్తిస్థాయిలో నాశనమైంది. అద్భుతమైన ఆయిల్ నిక్షేపాలకు కేంద్రమైన వెనిజులా దేశం పూర్తిగా మానవ వనరులను ఉపయోగించకుండా కేవలం వారిని హెలికాప్టర్ మనీకి అలవాటు చేసి పూర్తిస్థాయిలో ధ్వంసం అయింది. అప్పుల ఊబిలో కూరూకుపోయి పడరాని పాట్లు పడింది. ఒకానొక దశలో అక్కడి ప్రజలు పూర్తిస్థాయిలో జీవనం సాగించేందుకు కూడా అణువుగా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని తర్వాత తీసుకువచ్చిన సంస్కరణలు కాస్త ఫలితం ఇచ్చిన ఎప్పటికీ వెనిజులా వెనుకబడడానికి అప్పటి ఉచిత పథకాలే ప్రధాన కారణం అని చెబుతారు. ఇదే పరిస్థితి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు రాదు అని చెప్పలేం.
ఉపాధి హామీ పథకానికే మానవ వనరుల లంకె
ఆర్థిక వ్యవస్థలో పనులు జరగాలి. ఆ పనుల ద్వారా డబ్బును ప్రజలు సమకూర్చుకుంటారు. అమ్మకాలు కొనుగోలు ద్వారా చెల్లించే పన్నులు ద్వారా ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలకు అవసరమైన జీవన ప్రమాణాలు అందుతాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మొదట ఎలాంటి పని చేయకుండానే పేదలకు డబ్బు పంచాలి అనే ఆలోచన ద్వారా పుట్టింది. అయితే మానవ వనరులను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేయించడం వల్ల వారికి పని చేశామన్న సంతృప్తి తో పాటు పనికి తగ్గ వేతనాలు అందాయి అన్న ఆనందం దక్కుతుంది అని భావించి ఉపాధి హామీ పథకం రూపకల్పనను మార్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిలో వ్యవస్థ నడుస్తోంది. ఇది వచ్చే ఎన్నికల్లో జగన్కు మంత్రంలా పనిచేస్తుందా లేక ఆయన పతనానికి నాంది పలుకుతుందా అన్నది వేచి చూడాలి.