అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు రగులుతుంది. పార్టీ అనుబంధ విభాగాలు జోనల్ ఇన్ చార్జర్ వ్యవహారంలో రాజుకున్న వేడి క్రమక్రమంగా ఆ పార్టీలో పెరుగుతుంది. ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి నిర్వహించిన వారితో నియామక ప్రకటన విడుదలైన ఒక్కరోజులోనే పేర్లు మార్చేలా మాజీ ఇంచార్జ్ ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసుకుంటున్న పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో అనుబంధ విభాగాల విషయంలో ఇద్దరు కీలక నేతల మధ్య పోరు బయటపడింది.
అప్పటి నుంచి దూరం
గతంలో వైసీపీలో నెంబర్ 2 స్థానంలో విజయసాయిరెడ్డి కొనసాగే వారు. జగన్ తర్వాత జగన్ వ్యవహారాలు అన్ని దాదాపు విజయ్ సాయి రెడ్డి చూసేవారు. విపక్ష నాయకుల మీద ఇతర పార్టీల నాయకులు మీద విరుచుకుపడేవారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులు వరకు విజయసాయిరెడ్డి హవా సాగితే తర్వాత ఆయన అధికారాలకు క్రమక్రమంగా కత్తెర పడింది. కేవలం ఆయనను విశాఖకు మాత్రమే పరిమితం చేసేలా అక్కడి రాజకీయాలు మాత్రమే చక్కబెట్టుకునేలా జగన్ పూర్తిస్థాయిలో ఆయనను ఉత్తరాంధ్రకి పరిమితం చేశారు. తర్వాత జగన్ బంధువు పైన వై వి సుబ్బారెడ్డి కి కీలక బాధ్యతలు పార్టీలో దక్కాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతలు కూడా సుబ్బారెడ్డి చూశారు. దీంతో ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి ఒకవైపు వైవి సుబ్బారెడ్డి మరోవైపు అన్నట్లు అక్కడ వర్గాలు పుట్టుకొచ్చాయి. దీంతో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వైశాఖ నగరంలో రెండు వర్గాల మధ్య వైసీపీలోనే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి.
ఎటు వెళ్తుందో?
విజయ్ సాయి రెడ్డికి ఇటీవల వరకు ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అయితే తారకరత్న మృతి తర్వాత విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు అలాగే విపక్ష నాయకుడు చంద్రబాబుతో ఆయన సన్నిహితంగా మెలిగిన తీరు జగన్ కు అభద్రత భావాన్ని తీసుకువచ్చింది. దీంతో విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. జగన్ ఆంతరంగికుల ద్వారా ఈ సమాచారాన్ని విజయసాయిరెడ్డికి పంపిన ఆయన నుంచి సరైన స్పందన రాలేదని, కుటుంబ బంధుత్వం ఉండడంతోనే తారకరత్న విషయంలో విజయ్ సాయి రెడ్డి అంతా దగ్గరుండి నడిపించారని విజయసాయి రెడ్డి వర్గీయులు చెప్పడం విశేషం. అయితే విపక్ష నాయకుడు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన తీరు, ఆ తర్వాత కూడా విజయ్ సాయి రెడ్డి వ్యవహారం కాస్త సందేహాస్పదంగా మారడంతోనే జగన్ క్రమక్రమంగా విజయసాయిరెడ్డి అధికారాలకు కత్తెర వేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇంచార్జ్ బాధ్యతలు చూస్తున్నారు అన్న నెపంతో సుబ్బారెడ్డి ఏకంగా విశాఖపట్నంలో కీలక పదవుల విషయంలోనూ అగ్గిరాజేశారు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం విజయ సాయి రెడ్డికి చెక్ పెట్టే ప్రక్రియలో భాగమే అన్నది అర్థమవుతుంది. జగన్కు విషయం తెలియకుండా సుబ్బారెడ్డి ఏ పని చేయరు. సుబ్బారెడ్డి ఇంత గట్టిగా అనుబంధ విభాగాల విషయంలో పట్టుబడుతున్నారు అంటే కచ్చితంగా దాని వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నగర 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ ను, 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సాయి రెడ్డికి నమ్మిన బంటులుగా ఉన్న ఈ ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా విజయ సాయి రెడ్డి వర్గానికి బెదిరింపు సంకేతాలు పంపినట్లే భావించవచ్చని, ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయం ఎన్నికల నాటికి పూర్తి మలుపులు తిరుగుతుందని అర్థమవుతుంది.