జనసేన మూడో విడత వారాహి యాత్ర పై ఉత్కంఠ కొనసాగుతుంది నేడు ఉత్తరాంధ్రలోని మూడో విడత షెడ్యూల్ ఖరార్ అయింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లో వారహి యాత్ర ప్రారంభం కానుంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీతో జగదాంబ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం యాత్రకు ఎటువంటి అనుమతులు లేవని నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని ర్యాలీలు బహిరంగ సభలో డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదంటూ స్థానిక నాయకులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి విడతలో జనవాని కార్యక్రమానికి అనుమతులు లేకపోవడం పవన్ కళ్యాణ్ బస చేసే హోటల్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించడంపై అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది. ఇప్పుడు మళ్లీ అదే విధంగా విశాఖలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత కొనసాగుతుంది.
ఈసారి ఏం జరిగినా వారాహి యాత్ర కొనసాగించే తీరుతామంటూ జనసేన నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈసారి ఉత్తరాంధ్రలోని పర్యటన విజయవంతం చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. యాత్రను ఆపేందుకు ప్రభుత్వం శత విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ జనసేన నేతలు అధినేత సైనికులు మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ఈ అంశాల మధ్య మూడో విడత వారాహి యాత్రపై ఉత్కంఠత కొనసాగుతోంది.