దేశవ్యాప్తంగా త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఈసీ అధికారులు పర్యటిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు కూడా ఉండటంతో మరింత ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రెండుసార్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల గురించి కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పాదర్శకంగా ఎన్నికలు జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలు,పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు,అక్రమ మద్యం,నగదు సరఫరాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు…చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా రాష్ట్రంలో అధికారులతో సమావేశం తర్వాత ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసారు..ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణపై కీలక సూచనలు చేస్తున్నారు.
వచ్చే నెల 9 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరింత వేగంగా ముందుకెళ్తున్నారు. తాజాగా మరోసారి అమరావతికి వచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేసింది. ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల పర్యటనలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరోసారి అమరావతి వచ్చారు. త్వరలో జరుగనున్న సార్వత్రికల ప్రక్రియలో భాగంగా క్రమబద్దమైన ఓటర్ల అవగాహన, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలు(స్వీప్)అమలుకై జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో ఈసీఐ స్వీప్ అధికారులు చర్చించారు.
కేంద్ర ఎన్నికల సంఘం స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మీరా నేతృత్వంలో లవ్ కుష్ యాదవ్, రాహుల్ కుమార్ లు అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో ఎస్.మల్లిబాబు, రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన స్వీప్ నోడల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల వారీగా స్వీస్ కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి పౌరునికి, ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు, వారి సమాచార భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అందుబాటులో ఉన్న వివిధ ఆన్ లైన్, ఆఫ్ లైన్ మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో కేవలం ఓటు వేయడమే ఓటర్ బాధ్యత కాదని, పారదర్శకంగా ఎన్నికలు జరగడంలో ఓటర్లు కూడా ప్రముఖపాత్ర వహించేలా చూడాలని స్వీప్ నోడల్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఓటర్లలో స్వీప్ ద్వారా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే తుది ఓటర్ జాబితా విడుదలయినప్పటికీ ఓటర్ జాబితాలో మార్పులు-చేర్పులు, వివరాలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆయా అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా స్వీప్ నోడల్ అధికారులు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అడిగి తెలుసుకున్నారు.