తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో రూలింగ్ లో వస్తుందని అందరికీ నమ్మకం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కీలకంగా మారుతాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి ప్రభావం చూపించగలిగింది. ఏకంగా 15 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకు జనసేన ఒక స్థానాన్ని మాత్రం గెలుచుకోగలిగింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా మారిన పరిణామాలు, జిల్లాలో ఏమాత్రం అనుకూలంగా అధికార పార్టీకి లేకపోవడం ఇప్పుడు వైసిపి నేతల్లో కలవరానికి ముఖ్య కారణం.
జనసేన పట్టు
జనసేన పార్టీ పూర్తిస్థాయి ఆశలు పెట్టుకున్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. 2019 ఎన్నికల్లో పోలిస్తే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే కచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలం బాగా పెరిగింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కాపు ఓటరు ఎక్కువగా కనిపించే తూర్పుగోదావరిలో వారితోపాటు ఎస్సీలు, శెట్టిబలిజలు ప్రాబల్యం ఎక్కువ. కాపులు పూర్తిస్థాయిలో జనసేనకు మద్దతుగా నిలుస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. వారితోపాటు ఇతర వర్గాల్లోనూ జనసేన పార్టీ పట్ల సానుకూలమైన స్పందన కనిపిస్తోంది. అయితే ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పూర్తి ప్రభావం చూపిస్తుంది విజయం సాధిస్తుంది అన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. జనసేన పార్టీకి పెరిగిన బలాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది కూడా కీలకం కానుంది.
రెండు పార్టీలకు పొత్తు ఉంటే తిరుగులేదు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తు కుదిరినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేజర్ అసెంబ్లీ నియోజకవర్గాలను తెలుగుదేశం జనసేన గెలుస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. పూర్తి స్థాయి ప్రభావం పొత్తు కుదిరితే కచ్చితంగా ఉంటుంది. అధికార వైసీపీకి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యం అనే నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపించకపోవడం విశేషం.
పట్టున్న నేతలు లేరు
2019లో పూర్తిస్థాయి జగన్ గాలిలో చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు తప్పితే పూర్తి స్థాయిలో నియోజకవర్గ నేతలేవు తప్ప జిల్లాను ప్రభావితం చేసే నాయకులు వైసీపీలో కనిపించడం లేదు. ఇప్పుడు ఇదే వైసీపీ పెద్దలను కలవరపరుస్తోంది. మొన్నటివరకు మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సైతం కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు సైలెంట్ గా తన పని తాను చూసుకుంటున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సైతం సైలెంట్ అయ్యారు. మంత్రి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా ప్రభావం జిల్లా పై అంతంత మాత్రమే. దీంతో పూర్తిస్థాయి ప్రభావం చూపే నేతలు లేక వైసిపి నేతలు డీలా పడుతున్నారు.