రాష్ట్ర ప్రభుత్వం అదిగో డీఎస్సీ,ఇదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని..ఇప్పటికైనా తక్షణమే మెగా డిఎస్సీ పై ప్రకటన చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు వై.రాము,జి.రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 1.88 ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.69 లక్షల మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న 18,520 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఖాళీల విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు ,రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు పొంతన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 40 వేల ఉపాధ్యాయ ఖాలీలు ఉన్నాయని చెప్తుంటే …రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో తీసుకువచ్చి 10,000 పోస్టులను రద్దు చేసిందని విమర్శించారు.
తెలుగు మీడియం ను తీసేస్తూ 15,000 పోస్టులను రద్దు చేసిందని విరుచుకుపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో 2000 పాఠశాలలు మూతపడ్డాయని వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల లేక విద్యార్థుల డ్రాప్ అవుట్స్ అవ్వడం, ప్రైవెట్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారని తెలిపారు. రెండేళ్లలో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ఔట్ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయకుండా..అమల్లోకి తీసుకురావటం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలని…లేని పక్షంలో సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా,అధ్యక్ష,కార్యదర్శులు పి.కృష్ణ,యస్.నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.