తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజానగరం సీటు విషయంలో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన మూడు పార్టీల నేతలు ఈ కీలకమైన నియోజకవర్గం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో నిలుస్తారు అని భావిస్తున్న వెంకటేష్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓ కీలకమైన సీనియర్ నేత వలస వచ్చి పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.
రాజాకు పెద్ద మైనస్
జక్కంపూడి రాజా మీద తీవ్రమైన ఆరోపణలు ప్రజల్లో ఉండటమే కాదు వైసిపి నాయకుల్లోనూ ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ లతో తిరుగుతూ జక్కంపూడి రాజా తమ్ముడు గణేష్ అరాచకాల సృష్టిస్తున్నారని నియోజకవర్గం ప్రజల మీద రౌడీయిజం చేస్తున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. యువకులను మత్తుమందుకు బానిసలు చేసి కావాలని వెనుక తిప్పుకుంటూ అరాచకమైన పనులు సృష్టిస్తున్నారు అన్న నిందలు పడ్డారు. దీంతోపాటు జగనన్న ఇళ్ల కాలనీల అవినీతి వ్యవహారాలపై అప్పట్లో వచ్చిన పలు రకాల వివాదాలు జక్కంపూడి రాజ ను చుట్టుముట్టాయి. ఆ మధ్యన ఒక ప్రభుత్వ ఉద్యోగిని భౌతికంగా దాడి చేయడం కూడా రాష్ట్ర వ్యాప్త సంచలనం అయ్యింది. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాజా మీద తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తోంది.
ఎంపీతో పడదు
మరోవైపు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తో కూడా జక్కంపూడి రాజాకు వివాదాలు ఉన్నాయి. ఇద్దరు పరస్పరం వాదులాటతోపాటు బయటపడి తీవ్రంగా దూషించుకున్న సందర్భాలు చాలా కనిపిస్తాయి. జక్కంపూడి రాజా తన అనుచరులతో రౌడీయిజం చేస్తూ వైసిపి ప్రతిష్టను మసకబారిస్తున్నారు అని ఎంపీ చెబుతుంటే, ఎంపీ తీరు వల్ల వైసీపీకు ఏమీ ప్రయోజనం లేదు అని జక్కంపూడి రాజా చెబుతున్నారు. ఇద్దరు బహిరంగంగా మరోవైపు సోషల్ మీడియాలోనూ వ్యక్తిగత విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పంచాయతీ సీఎం జగన్ వరకు వెళ్ళింది. ఇద్దరు కలిసి పని చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన ఇద్దరి వైఖరిలోనూ మార్పు లేదు. ఇది కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించే అవకాశం కూడా కనిపిస్తోంది.
జనసేనక లేక ఆ నేతకా??
రాజానగరం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నుంచి బత్తుల బలరామకృష్ణ చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఆర్థికంగానూ కార్యకర్తల కోసం ఖర్చు పెడుతున్నారు. బత్తుల బలరామకృష్ణ తో పాటు ఆయన సతీమణి వెంకటలక్ష్మి కూడా ప్రజల్లో తిరుగుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరు చాలా తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఇది కచ్చితంగా జనసేన పార్టీకి బలం పుంజుకునే చర్యగా చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ గురుదత్ కూడా యాక్టివ్ గా ఉన్నారు. అయితే టిడిపి జనసేన పుత్తు కుదిరితే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి రూరల్ నుంచి ఆయన వలస వచ్చి ఇక్కడ పోటీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయితే చివర్లో ఏదైనా జరగవచ్చు.