ఎన్నికల బాండ్ల పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్బిఐ విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత నాలుగేళ్ళలో అమ్మినబాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్ అందించాలనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషన్ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందన్నారు. బాండ్ల పై సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఆ వివరాలను వెల్లదించడానికి బదులు , గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని ఎస్బిఐ కోర్టును ఆశ్రయించిందని వివరించారు.
జూన్ 30కల్లా కోరిన సమాచారమంతా అందచేస్తామని తెలిపింది. అంటే ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్లు వివరాలు వెల్లడిరచకుండా వుండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోంది అని అన్నారు. తన కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసిన ఎస్బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్ది రోజుల్లో పొందుపరిచి ఇవ్వలేక పోయిందంటే నమ్మశక్యంగా లేదుని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ళ కారణంగానే ఎస్బిఐ సహించరాని ఈ వైఖరి తీసుకుందిని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్బిఐ అందచేసేలా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్బిఐ వైఖరిని నిరసిస్తూ వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని కోరుతూ మార్చి 11న ఎస్బిఐ బ్రాంచీల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు